తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్లు ఎంతో మంది వచ్చారు..వస్తూనే ఉన్నారు. అయితే చాలా కొద్ది మంది మాత్రం కమెడియన్లుగా రాణిస్తూనే..హీరోలుగా మారారు. ఒకప్పుడు రాజబాబు, చలం, పద్మనాభం లాంటి వారు కమెడియన్లుగా కొనసాగుతూనే హీరోలుగా నటించారు. ఆ తర్వాత బ్రహ్మానందం, ఆలీ కూడా హీరోలుగా నటించి కమెడియన్లుగా స్థిరపడ్డారు. ఇండస్ట్రీలోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి అందాల రాముడు చిత్రంతో హీరోగా మారిన సునీల్ కొంత కాలం హీరోగా నటించారు. ప్రస్తుతం ఆయన కూడా కమెడియన్ గా నటించడం విశేషం. వీరి బాటలోనే నడుస్తున్నారు..కమెడియన్ల శ్రీనివాస్ రెడ్డి. ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’లతో మంచి సక్సెస్ అందుకున్నాడు.
ఈ మద్య సోషల్ మీడియాలో కాస్త పాపులర్ అయిన వారిని టార్గెట్ చేసుకొని వారి అకౌంట్స్ హ్యాక్ చేయడం కొంత మంది సైబర్ నేరగాళ్లకు అలవాటైంది. ఈ నేపథ్యంలో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి పేరిట ఫేస్బుక్లో నకిలీ ఖాతా తెరిచి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై శ్రీనివాసరెడ్డికి క్షమాపణలు చెప్పించి, ఖాతాను తొలగించడంతో వివాదానికి ఫుల్స్టాప్ పడింది. పోలీసుల కథనం ప్రకారం నటుడు శ్రీనివాసరెడ్డి పేరిట ఇటీవల ఫేస్బుక్లో నకిలీ ఖాతా ఏర్పాటైంది. సినీ పరిశ్రమలో సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న రవికిరణ్ అనే వ్యక్తి ఈ ఖాతాను సృష్టించినట్టు పోలీసులు గుర్తించారు.
నకిలీ ఖాతా నుంచి చాటింగ్ ప్రారంభించిన రవికిరణ్ ఎవరికీ అనుమానం రాకుండా అచ్చం శ్రీనివాసరెడ్డిలానే చాటింగ్ చేసేవాడు. అంతే కాదు ఒక అడుగు ముందుకు వేసి కేరళా బాధితుల కోసం విరాళం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ విషయం శ్రీనివాస్ దాకా వచ్చింది...తన పేరిట ఫేస్ బుక్ ద్వారా వసూళ్లు చేయడం తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. వెంటనే శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు రవికిరణ్ను నిందితుడిగా గుర్తించి స్టేషన్కు పిలిపించారు. అయితే రవికిరణ్ చేసిన తప్పుకు శ్రీనివాసరెడ్డికి క్షమాపణ చెప్పించి, ఖాతాను తొలగించడంతో వివాదం సమసింది.