ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే హాలీవుడ్, బాలీవుడ్ లో కొన్ని సార్లు స్టార్ హీరోలు సైతం విలన్లుగా నటించిన సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో మల్టీస్టారర్ మూవీలు వచ్చాయి..అవి అక్కడ కామన్. అయితే ఇప్పుడు తెలుగు, తమిళ్ లో కూడా మల్టీస్టారర్ మూవీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. బాలీవుడ్లో అతిపెద్ద మల్టీస్టారర్ మూవీ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లున్నారు ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్. ఆయన సొంత సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో సూపర్స్టార్లు ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్, ఆలియా భట్, దీపిక పదుకొణె నటించబోతున్నట్లు సమాచారం. కరణ్ జోహార్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫొటో ఈ ఊహాగానాలకు తెరతీస్తోంది. గతంలో ఆమిర్, సల్మాన్, షారూక్ వంటి స్టార్ హీరోలు కలిసి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమిర్, అమితాబ్ బచ్చన్ కలిసి `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్` సినిమాలో నటించారు. త్వరలో `అతిపెద్ద బ్లాక్బస్టర్ రాబోతోంది` అంటూ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తాజాగా ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. తాము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ ఒకే తెరపై కనిపిస్తే అంతకన్నా ఆనందం ఉంటుందా అని అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. అంతే కాదు వీరందరూ కలిసి ఒక సినిమాలో నటిస్తే.. అది కచ్చితంగా సెన్సేషనల్ సినిమా అవుతుంది. ఇదిలా ఉంటే..ఆమిర్ ఖాన్, అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’.
ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదల అయిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ఈ ట్రైలర్ను ముంబయిలోని రణ్బీర్ కపూర్ నివాసంలో ప్రదర్శించారట. ట్రైలర్ చూడటానికి వారంతా రణ్బీర్ నివాసానికి వెళ్లారని విశ్వసనీయ వర్గాల సమాచారం. బహుషా అక్కడ వీరంతా కలిసి ఫోటో తీయించుకొని ఉంటారని..అది కరణ్ జోహార్ తాజాగా ట్వీట్ చేసి ఉంటారని భావిస్తున్నారు.