భారతీయ చలన చిత్ర రంగంలో పూర్తి స్థాయిలో రోబోటిక్ చిత్రంగా స్టార్ డైరెక్టర్ శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన ‘రోబో’దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపింది.  ఈ చిత్రం తర్వాత దాదాపు ఏనిమిది సంవత్సరాల తర్వాత రోబో సీక్వెల్ ‘2.0’రాబోతుంది.  రజనీకాంత్ .. అక్షయ్ కుమార్ కథానాయకులుగా నటించిన '2.ఓ' సినిమాను దర్శకుడు శంకర్ రూపొందిస్తున్నాడు. మొదటి భాగానికి మించి ఈ సీక్వెల్ వుండేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 

ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా..కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.  ఈ మద్య ‘2.0’ టీజర్ రిలీజ్ చేశారు.  టీజర్ చూస్తుంటే..ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్ లో తలపించింది.  అయితే 2.0 చిత్రంపై అప్పుడే రక రకాల కథనాలు వెలువడుతున్నాయి.  ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ పాత్ర  పై ఎన్నో రకాల రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అక్షయ్ కుమార్ ఈ సినిమాలో 'క్రో మ్యాన్' గా కనిపించనున్నాడని కొంతమంది అంటుంటే, డాక్టర్ రిచర్డ్స్ పాత్రలో కనిపించనున్నాడని మరి కొంతమంది అంటున్నారు.  తాజాగా ఈ రూమర్స్ డైరెక్టర్ శంకర్ వద్దకు వెళ్లడంతో ఆయన స్పందించారు.

ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ 'క్రో మ్యాన్' గా గానీ .. డాక్టర్ రిచర్డ్స్ పాత్రలో గాని కనిపించడం లేదని ఆయన చెప్పారు. ఎవరి ఊహలకు అందనట్టుగా ఆయన పాత్రను డిజైన్ చేసినట్టుగా స్పష్టం చేశారు. దాంతో ఈ ప్రచారానికి తెరదించినట్టయింది. దీపావళికి ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలనున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: