ప్రముఖ వయోలినిస్ట్, గాయకుడు, మ్యుజీషియన్ బాలభాస్కర్ (40) కన్నుమూశారు. గత నెల 25న రోడ్డు ప్రమాదానికి గురై, తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దైవ దర్శనానికి వెళ్లిన ప్రముఖ వయోలినిస్ట్, మ్యుజీషియన్ బాలభాస్కర్ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైందన్న విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో ఆయన కుమార్తె తేజస్వి అక్కడికక్కడే చనిపోయిది. తిరువనంతపురం శివారు ప్రాంతం పల్లిప్పురమ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
త్రిస్సూర్లో ఓ దేవాలయాన్ని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా.. వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. బాలభాస్కర్, ఆయన భార్య లక్ష్మితో సహా డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యారు. ఇక బాలభాస్కర్ పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. వారం రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న భాల భాస్కర్ కన్ను మూశారు.
గత వారం రోజులుగా ఆయన కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న అభిమానులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన 12 సంవత్సరాల వయసులోనే సంగీత వృత్తిలోకి ప్రవేశించి, మలయాళ చిత్ర పరిశ్రమలో అతి చిన్నవయసున్న సంగీత దర్శకుడిగా పనిచేసిన గుర్తింపును తెచ్చుకున్నారు. వయోలినిస్ట్ గా ఉస్తాద్ జాకిర్ హుస్సేన్, శివమణి, హరిహరన్, ఫాజల్ ఖురేషి తదితరులతో కలసి పనిచేశారు. భాల భాస్కర్ మృతికి టాలీవుడ్, కోలీవుడ్ సంతాపాన్ని తెలియజేశారు.