తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి..చలన చిత్ర రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటులు విశ్వనట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితానికి సంబంధించిన చిత్రం ‘ఎన్టీఆర్’బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా..ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు ఈ మద్య పోస్టర్స్ రూపంలో తెలిపారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు ’ఇందులో ఆయన నట ప్రస్థానం గురించి తెలియజేస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్య నటీనటులను తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సతీమణిగా విద్యాబాలన్, ఏఎన్ఆర్ గా సుమంత్, సీఎం చంద్రబాబు గా రానా మరికొంత మంది ముఖ్య పాత్రల్లో తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఎన్టీఆర్ తో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మెప్పించిన దివంగత నటి శ్రీదేవి పాత్రలో అందాల భామ రకూల్ ప్రీత్ సింగ్ ని తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.
కాగా, 'వేటగాడు' చిత్రంలోని 'ఆకు చాటు పిందె తడిసె' సాంగ్ లో బాలయ్యతో కలసి రకుల్ రంజింపజేయబోతోంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తొలి భాగం జనవరి 9న, రెండో భాగం జనవరి 24న విడుదల కానున్నాయి.