తెలుగు ఇండస్ట్రీలోకి ‘హ్యాపీడేస్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తర్వాత కార్తికేయ తో వరుస విజయాలతో దూసుకు పోతున్నారు. నిఖిల్ తాజా చిత్రంగా 'ముద్ర' రూపొందుతోంది. టి.ఎన్. సంతోష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగుతో పాటు డబ్బింగ్ కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తూ వస్తున్నారు. సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలను ఎలా మీడియా పరిష్కరిస్తుంది.. అందులో మీడియా బాధ్యతను గుర్తు చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు టిఎన్ సంతోష్.
లావణ్య త్రిపాఠి తొలిసారి నిఖిల్ తో జోడీకట్టింది.
ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ అర్జున్ సురవరంగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో నిఖిల్ వున్నాడు. ఇక ఈ మధ్య రేస్ లో లావణ్య త్రిపాఠి కాస్త వెనుకబడిపోయింది. అందువలన ఆమె కూడా ఈ చిత్రం హిట్ తనకి చాలా అవసరమని భావిస్తోంది.మరి వాళ్లు ఆశించిన ఫలితాన్ని ఈ చిత్రం అందిస్తుందో లేదో చూడాలి.
ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా మరియు రాజా రవీంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి మరియు మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పి సంస్థలపై కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ ముద్ర సినిమాను నిర్మిస్తున్నారు. బి మధు ఈ చిత్రానికి సమర్పకుడిగా ఉన్నారు.