టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి అంటే వెంటనే గుర్తుకు వస్తాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. చేసింది మూడు సినిమాలే అయినా..స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి ఈ మద్య రిలీజ్ అయిన ‘గీతా గోవిందం’ సినిమాలు వరుస విజయాన్ని అందుకున్నారు. కాకపోతే ఈ నెల 5న రిలీజ్ అయిన ‘నోటా’ మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చింది. అయితే ఎక్కడా నిరుత్సాహ పడకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు విజయ్ దేవరకొండ. తాజాగా విజయ్ దేవరకొండ తమ మానవత్వాన్ని నిరూపించుకున్నాడు.
ఎక్కడ ఏ విపత్తు వచ్చి ప్రజలు అల్లాడిపోతున్నా సాయం చేయడంలో ముందుండే టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ మరోమారు ముందుకొచ్చాడు. ఈ మద్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఉత్తరాంధ్రను ‘తిత్లీ’తుఫాన్ ఛిద్రం చేసింది. తిత్లీ తుపానుతో అతలాకుతలం అయిన శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేందుకు తనవంతు సాయం ప్రకటించాడు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు అందించాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తిత్లీ తుపాను కారణంగా దెబ్బతిన్న సిక్కోలును ఆదుకోవాల్సిందిగా ముందుకు రావాలంటూ అభిమానులకు పిలుపునిచ్చాడు.
ఆయన పిలుపుతో పలువురు అభిమానులు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు. కాగా, ఈ తిత్లీ తుఫాన్ మిగిల్చిన విషాదానికి ముందుగా స్పందించింది మాత్రం తెలుగు కామెడీ హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. తిత్లీ తుపాను బాధితులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించాడు. ఆ వెంటనే విజయ్ దేవరకొండ రూ.5 లక్షలు ప్రకటించాడు.
బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన వీరిద్దరిపైనా ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతే కాదు ఈ మద్య వరదలతో అతలాకుతలమైన కేరళకు కూడా విజయ్ దేవరకొండ రూ.5 లక్షల విరాళం ప్రకటించాడు. తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేయగా వచ్చిన రూ.25 లక్షలను తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి అందించిన సంగతి తెలిసిందే.