ఊహించని సునామీలా రామ్ గోపాల్ వర్మ మళ్ళీ రంగంలోకి తీసుకు వచ్చిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ నటీనటుల కోసం చేస్తున్న ప్రయత్నాలు హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు నాయుడును పోలి ఉన్న ఒక వ్యక్తి ఫోటోను విడుదల చేసి ఆవ్యక్తి వివరాలు చెప్పిన వారికి 10 లక్షల పారితోషికం ఇస్తాను అంటూ వర్మ ప్రకటించిన ఆఫర్ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఇది ఇలా ఉంటే విజయదశమి రోజున వర్మ ఈ సినిమాకు సంబంధించి ప్రకటించబోయే వివరాల పై ఆసక్తి పెరగడమే కాకుండా అసలు ఈ ప్రాజెక్ట్ వెనుక ఎవరు ఉన్నారు అన్న కోణంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీలో నటించే నటీ నటులు అంతా ముంబాయికి చెందిన బాలీవుడ్ ఇండస్ట్రీ వ్యక్తులు అని తెలుస్తోంది. 

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన కీలక నటీనటుల ఎంపికను వర్మ పూర్తి చేయడమే కాకుండా ఈమూవీ షూటింగ్ కు సంబంధించిన కొన్ని సెట్స్ ను ఒక ప్రముఖ ముంబాయి స్టూడియోలో నిర్మాణం పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈసినిమాకు నిర్మాతగా ఒక ఉత్తరాది ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉండబోతున్నాడని టాక్. 

దీనితో ఆ ఉత్తరాది నిర్మాతకు లక్ష్మీ పార్వతి జీవితం పై ఎందుకు ఆసక్తి ఏర్పడింది అన్న సందేహాలు కలగడమే కాకుండా ఈమూవీ వెనుక భారీ స్థాయిలో బ్లాక్ మనీ మార్పిడి జరుగుతుందా అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఫిలిం ఇండస్ట్రీలో బ్లాక్ మనీ వ్యవహారం సర్వసాధారణమే అయినా ఒక వివాదాస్పద పొలిటికల్ మూవీ గురించి ఆసక్తి కనపరుస్తూ ఈమూవీకి పెట్టుబడి పెట్టబోతున్న ఆ ఉత్తరాది నిర్మాతను నడిపిస్తున్న తెలుగు వ్యక్తులు ఎవరు అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. దీనితో కొంతకాలం రాజకీయాలలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వార్తలు సందడి చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: