ఆంధ్రప్రదేశ్ లో ఈ మద్య వచ్చిన ‘తిత్లీ’ తుఫాన్ ఎంత బీభత్సం మిగిల్చిందో అందరికీ తెలిసిందే. గతంలో హుధూధ్ తుఫాన్ భారిన పడి ఎంతో నష్టపోయారు..ఇప్పుడు ఈ మాయదారి ‘తిత్లీ’తో సిక్కోలు ప్రజలు కష్టాల పాలయ్యారు. అయితే ప్రకృతి పరంగా ఎలాంటి వైపరిత్యాలు వచ్చినా..టాలీవుడ్ ఇండస్ట్రీ ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మొదట రెస్పాండ్ అయ్యింది మాత్రం కమెడియన్ బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. తిత్లీ తుఫాన్ బాధితుల కోసం రూ.50 ఇచ్చారు. దాంతో ఒక్కో హీరో విరాళం ఇవ్వడం మొదలు పెట్టారు.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, వరుణ్ తేజ్, కళ్యాణ్ రామ్ తమ స్థాయికి తగ్గట్లు విరాళాన్ని అందించారు. తాజాగా యువ హీరో నిఖిల్ సిద్ధార్ధ తితిలీ ప్రభావిత ప్రాంతానికి వెళ్ళి వారిని పరామర్శించడంతో పాటు అక్కడే ఉండి అందరికి తన వంతు సాయాన్ని అందిచాడు. మూడు వేల మందికి భోజన సదుపాయం కలిపించిన నిఖిల్ 2500 కిలోల రైస్ , 500 దుప్పట్లు, పవర్ కట్స్ని నివారించేందుకు పోర్టబుల్ జనరేటర్స్ కూడా అందించాడు.
తుఫాన్ తో ఇక్కడ పరిస్థితి ఛిన్నాభిన్నమైందని..ఇక్కడి ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారని..ఇండస్ట్రీ వర్గానికి చెందిన వారే కాకుండా ఇతర సంస్థల వారు కూడా తమకు తోచిన సహాయం అందించాలని కోరుతున్నారు నిఖిల్. ప్రస్తుతం తాను శ్రీకాకుళం జిల్లా గుప్పిడిపేట గ్రామంలో ఉన్నానని.. అనంతరం తాను పల్లిసారధి గ్రామానికి వెళ్లనున్నానని నిఖిల్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అయితే నిఖిల్ స్వయంగా తమ గ్రామాలకు వచ్చి సాయమందించడంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం నిఖిల్ ‘ముద్ర’సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ కి జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తుంది. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైనమిక్స్, ఎల్ఎల్పి పతాకాలపై కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.