సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారే స్టార్ డమ్ రావడం అనేది అంత సామాన్య విషయం కాదు. కానీ మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ కి మాత్రం స్టార్ ఇమేజ్ తక్కువ సమయంలోనే వచ్చింది. తెలుగులో రామ్ హీరోగా నటించిన ‘నేను శైలజ’మంచి విజయం అందుకున్న తర్వాత నాని తో నటించిన ‘నేను లోకల్’సూపర్ హిట్ అయ్యింది. ఈ రెండు సినిమాల తర్వాత తమిళ, తెలుగు, మళియాళ భాషల్లో కీర్తి సురేష్ నటిస్తున్న తరుణంలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’సినిమా ఈ అమ్మడి లెవెల్ ఎక్కడికో తీసుకు వెళ్లింది.
అప్పటి వరకు కీర్తి సురేష్ అంటే నటిగా చూసిన వారు..మహానటి సావిత్రితో పోల్చడం మొదలు పెట్టారు. వాస్తవానికి ఈ సినిమాలో కీర్తి సురేష్ మహానటి సావిత్రి పాత్రలో జీవించిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు తెలుగులో క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘ఎన్టీఆర్’ బయోపిక్ తీస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్యపాత్రలు నాగేశ్వరరావుగా సుమంత్, శ్రీదేవిగా రకూల్ ప్రీత్ సింగ్, ఎస్వీఆర్ గా నాగబాబు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో రానాను తీసుకున్నారు.
ఎన్టీఆర్ తో ఎక్కువ సినిమాల్లో నటించిన మహానటి సావిత్రి పాత్ర కీర్తి సురేష్ నటిస్తుందని ఆ మద్య వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది. ‘మహానటి’సినిమా అనేది నాకు ఒక వరం లాంటిది..అది ఓ మ్యాజిక్. మళ్లీ నేను సావిత్రి పాత్రలో కనిపిస్తే అలా నటించగలనో, లేదో నాకే తెలియదు. అంతే కాదు మళ్లీ నేను సావిత్రిగా నటించగలనో లేదో నాకే తెలియదు. అందుకే `ఎన్టీయార్`లో మళ్లీ సావిత్రి పాత్రలో కనిపించడానికి ఒప్పుకోలేదు. సావిత్రి పాత్ర మాత్రమే కాదు.. ఇకపై బయోపిక్ సినిమాలు వేటిలోనూ నటించకూడదని నిర్ణయించుకున్నానని కీర్తి చెప్పింది.