'బెంగళూరు బంగారు బొమ్మ" బ్యూటీ క్వీన్ - అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాన్ తో ఆడిపాడి ప్రేక్షకులకు షోడ్రసోపేతమైన అందాల విందు వడ్దించిన సినీనటి ప్రణీత సుభాష్ కర్ణాటక రాష్ట్రం లోని హస్సన్ జిల్లా లోని ఆలూర్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలని దత్తత తీసుకొని అందరి హృదయాలు గెలుచుకుంది. నటనా సామర్ధ్యం ఉన్నా కాలం అంతగా కలసిరాకున్నా, అదృష్టం ఆమడ దూరంలో ఉండిపోయినా, సినిమాలతో అంతగా అలరించ కున్నా, విశాల హృదయంతో తన సామాజిక సేవలతో మాత్రం అభిమానుల మనస్సులను అలరిస్తూ దోచుకుంటూనే ఉంటుంది.
2017 లో మొట్ట మొదటిసారి ప్రభుత్వ పాఠశాలలో వాలంటీర్ గా పని చేసి బడి వాతావరణం, పిల్లలు చదివే విధానాన్ని గమనించింది. ఏడో తరగతి విద్యార్థి కి కూడా కనీసం ఇంగ్లీష్ బాష పై అవగాహన లేదని తెలుసుకొని ప్రభుత్వ పాఠశాలని తాను దత్తత తీసుకుంది. ఆ పాఠశాల అభివృధ్ధి కోసం ₹ 5 లక్షల రూపాయలు ముందుగా విరాళంగా అందించి, విద్యార్థినులకి మరుగుదొడ్లని ఇతర వసతులు ఏర్పాటు చేయడం మా తొలి ధ్యేయం అంటుంది ప్రణీత. ఆ తర్వాత విద్యార్ధులకు అవసరమైన విద్యతోపాటు ఇతర వృత్తి నైపుణ్యాలు కూడా నేర్పించాలని అనుకుంటున్నాం. ఇందుకోసం మా స్నేహితులంతా కలసి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం ప్రణీత స్పష్టం చేసింది.
తన తండ్రి పుట్టిన ఊరు ఆలూర్ కాగా, ముందుగా ఈ ఊరు లోని స్కూల్ ని అభివృద్ధి పరచి ఆ తర్వాత మిగతా ప్రాంతాల పాఠశాలలని కూడా దత్తత తీసుకోని అభివృద్ధి పరచాలని అనుకుంటున్నట్లు ప్రణీత చెప్పుకొచ్చింది. సెకండ్ హీరోయిన్ గా ఎక్కువ చిత్రాలలో కనిపించిన ప్రణీత రేపు అక్టోబర్ 18న విడుదల కానున్న “హలో గురు ప్రేమ కోసమే” చిత్రంలో కథానాయిక గా నటించింది. ఈ మూవీతో రేపు తెలుగు ప్రేక్షకులని పలకరించనుంది ఈ అందాల ముద్దుగుమ్మ.