శరన్నవరాత్రుల ఉత్సవాలలో చివరి రోజైన ఈరోజు అమ్మవారు ఒకరోజునే రెండు అలంకారాలలో దర్శనం ఇస్తుంది అమ్మ. ఈరోజు తెల్లవారుజామున నుండి ఉదయం 11గంటల వరకు మహిషాసుర మర్ధిని అలంకారంలో అమ్మ దర్శినమిస్తే ఆతరువాత రాజరాజేశ్వరి అమ్మవారి అవతారంలో శాంతి స్వరూపిణిగా దర్శనమిస్తుంది. 

ఈరోజు శ్రీమాతను చైతన్య శక్తిగా భావించి అజ్ఞాన్నాన్ని మనలోని దుష్టత్వాన్ని తొలిగించాలని కోరుతూ విశేష పూజలు చేస్తారు. ఇక సాయంత్రం జమ్మివృక్షం దగ్గరా లేదంటే జమ్మి కొమ్మ పెట్టుకుని చేసే పూజలలో అనేక నిఘూఢ అర్ధాలు ఉన్నాయి. శ్రీరామచంద్రుడుకి విజయం కలిగించినట్లే మనకు కూడ విజయం కలిగించాలని కోరుతూ ఎటువంటి విఘ్నాలు లేకుండా మనకు అన్ని విధాల అన్ని విషయాలలో విజయాలు కలగాలని కోరుతూ ఈపూజలు చేస్తారు. 

పాపాలు నాశనం చేసే మహిమ శమీవృక్షానికి ఉన్న నేపధ్యంలో ఈరోజు మనం చేసే శమీవృక్ష పూజలు మనం గత జన్మలలో చేసిన పాపాలు పోగొడతాయి అని ప్రతీతి. అజ్ఞాతవాసం చేయబోయే ముందు పాండవులు ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు శమీవృక్షాన్ని పూజించి విజయాలు అందుకున్నారని పురాణాలు చెపుతున్నాయి.
ఎంతో పవిత్రమైన జమ్మిచెట్టు యుగయుగాల నుండి మన భారతీయ సంస్కృతిలో పెనవేసుకుని పోయింది. క్షీరసాగర మధనంలో పాలసముద్రం నుంచి ఉద్భవించిన దేవతా వృక్షాలలో ఒకటిగా జమ్మిచెట్టును పేర్కొంటారు.

చెడు పై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా పురాణ కాలం నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం విజయదశమి రోజున శమీ వృక్షానికి పూజ చేయడంతో విజయదశమి పండుగ ముగుస్తుంది. ఇదేరోజు సాయంత్రం ప్రతి ఊరిలోనూ ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో భారీ స్థాయిలో తయారుచేసిన రావణాసురుడు బొమ్మలను కాల్చి వేయడం ద్వారా ఎంతటి గొప్ప వ్యక్తి అయినా నీతి తప్పి చెడుగా ప్రవర్తిస్తే పతనం తప్పదు అన్న సంకేతాలు కనిపిస్తాయి. తిధులలో వచ్చిన తేడాలు వల్ల ఈరోజు ఒకేరోజున అమ్మవారి రెండు అవతారాల అలంకరణలు కనిపించడం ఈసారి దసరా ప్రత్యేకత ఈ విజయదశమి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ అపరాజితా శక్తి దుర్గాదేవి అనుగ్రహంతో సకల విజయాలు అందరికీ కలుగచేయాలని ఇండియన్ హెరాల్డ్ శుభాకాంక్షలు..



మరింత సమాచారం తెలుసుకోండి: