పందెం కోడి సీక్వెల్ గా వచ్చిన పందెం కోడి 2 ప్రేక్షకలను బాగా నిరాశ పరిచిందనే చెప్పాలి. పందెం కోడి మొదటి పార్ట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో లేవని అందరూ చెబుతున్న మాట. పదమూడేళ్ల తర్వాత విశాల్-లింగుసామి కలిసి చేసిన చిత్రానికి 'పందెంకోడి' సీక్వెల్ అనే పేరు పెట్టుకోవడం తమపై తామే ఒక భారాన్ని మోపుకున్నట్టు అయింది. 'పందెంకోడి'తో సంబంధం లేకుండా దీనినో ఇండివిడ్యువల్ సినిమాగా తీసి వుండొచ్చు. సీక్వెల్ అనడం వల్ల కొన్ని పరిమితులు, కొంత రాజీలు అవసరమయ్యాయి. జాతర నేపథ్యంగా సాగే ఈ సీక్వెల్ అంతా 'ఏడు రోజుల జాతర' సజావుగా సాగడం మీదే దృష్టి పెడుతుంది. దాంతో సినిమా మొదలైన దగ్గర్నుంచి ముగింపు వరకు జాతర జరుగుతూనే వుంటుంది.
తమిళ రూరల్ బ్యాక్డ్రాప్ సినిమాలు తెలుగు వారికి అంతగా కనక్ట్ అవ్వవు. పట్నం నేపథ్యంలో ఎక్కువ తారతమ్యాలు లేకపోయినా తమిళ రూరల్ నేటివిటీకి, మనకీ అసలు సరిపడదు. సదరు తమిళ ఫ్యాక్షన్ని మన సీమ ఫ్యాక్షన్లా చిత్రీకరించడానికి అనువాద రచయితలు కృషి చేసినా కానీ, మరీ జాతర నేపథ్యం కావడం వల్ల ఎంత ప్రయత్నించినా మన అభిరుచికి తగ్గట్టుగా ఇది మారలేదు.
నేపథ్యాన్ని విస్మరించి, నేటివిటీని పట్టించుకోకుండా ఎంజాయ్ చేయడానికి తగ్గ కథ, కథనాలు ఇందులో లేవు. కొన్ని యాక్షన్ దృశ్యాల్లో మెరుపులు చూపించినప్పటికీ ఒకప్పుడు తనలోని 'మాస్ దర్శకుడిని' మళ్లీ మన ముందుకి తీసుకురాలేకపోయాడు. సీక్వెల్ కావడం వల్ల తండ్రి పాత్రకి రాజ్ కిరణ్నే తీసుకోవాల్సి వచ్చింది. పదమూడేళ్ల క్రితం ఆయనలో వున్న చురుకు ఇప్పుడు లేకపోవడంతో ఆయనపై తీసిన యాక్షన్ దృశ్యాలు యాంత్రికంగా తయారయ్యాయి.