‘మహానటి’ మూవీతో విపరీతమైన కీర్తి ప్రతిష్టలు అందుకున్న కీర్తి సురేశ్ ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సావిత్రి పాత్ర చేసిన తరువాత ప్రస్తుతం ఆమె పడుతున్న మానసిక వ్యథను వివరించింది. ఈసినిమా కోసం తాను పది నెలలు నటించడంతో పాటు ఏకంగా డబ్బింగ్ కోసం మూడు నెలలు తాను తీసుకోవడంతో ఒక సంవత్సర కాలం అంతా తన జీవితంలో ఎక్కువ భాగం ‘మహానటి’ మూవీతో పెనవేసుకు పోవడంతో తనకు ఏర్పడ్డ కొన్ని విచిత్ర సమస్యలను బయట పెట్టింది కీర్తి సురేశ్.
ఈసినిమాలో తాను నటించేడప్పుడు తన లుక్ లో సహజత్వం కోసం తన ఇంటిలోని తన రూమ్ లో సావిత్రి ఫోటోలతో నింపేసానని అదేవిధంగా సావిత్రి జీవితానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు చదివి వెంటనే సావిత్రి ఫోటోను చూడటం అలవాటు చేసుకున్న తరువాత ఈమూవీ విడుదలైపోయినా ఆ అలవాటు తప్పక పోవడంతో తాను ప్రస్తుతం ఎదుర్కుంటున్న మానసిక స్థితిని బయట పెట్టింది కీర్తి. ప్రతిరోజు తాను తన రూమ్ లో ఏకాంతంగా కూర్చుని సావిత్రి ఫోటోల వైపు మౌనంగా చూస్తూ ఉండటంతో తనకు అనుకోకుండానే కన్నీళ్లు వస్తున్న సందర్భాన్ని బయట పెట్టింది ఈ క్రేజీ హీరోయిన్.
ఈసినిమా వల్ల తనకు ఎంత గౌరవం వచ్చిందో తెలియదు కానీ సావిత్రి పాత్ర వల్ల తనకు మానసిక సమస్యలు ఏర్పడ్డాయి అంటూ తనపై ఏర్పడ్డ సావిత్రి ఫోబియాను వివరించింది. అంతేకాదు తాను ఏదైనా పబ్లిక్ ఫంక్షన్ కు వెళ్ళినప్పుడు తనను తన పేరుతో కాకుండా ‘సావిత్రి సావిత్రి’ అంటూ అందరూ పిలవడం తనకు భయం కలిగిస్తోంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
దీనితో సావిత్రి పాత్ర ఇచ్చిన క్రేజ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ కొత్త పాత్రలు ఎంపిక చేసుకోవడం తనకు సమస్యగా మారింది అంటూ తన టెన్షన్ బయట పెడుతోంది ఈ వెండి తెర ‘మహానటి’. దీనితో తన రూమ్ లోని సావిత్రి ఫోటోలను తీసివేయమని తన తల్లి చెపుతున్నా అమాయకంగా తన వంక చూస్తున్న సావిత్రి ఫోటోలలోని అమాయకత్వం తన చేతులను కట్టేస్తోంది అంటూ సావిత్రి ఫోటోలతో తాను పడుతున్న పాట్లను వివరించింది కీర్తి సరేష్..