ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల కుమారులు వారసులుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కుమార్ కూడా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా మారారు. ఇప్పటి వరకు మంచు మనోజ్ నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినా..యావరేజ్ టాక్ తో మనోడికి మంచి పేరు వచ్చింది. చిత్రాలే కాకుండా ఇతర విషయాలపై కూడా మంచు మనోజ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. డ్యాన్స్, మ్యూజిక్ ఇలా ఎన్నో విషయాల్లో ప్రత్యేక ఏర్పాటు చేసుకున్నాడు.
తాజాగా మంచు మనోజ్ మరో కొత్త నిర్ణయం తీసుకున్నాడు. ఇండస్ట్రీకి కొంతకాలం విరామం ఇచ్చి, రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మోహన్ బాబు వారసుడు మంచు మనోజ్ భావిస్తున్నారా? సోషల్ మీడియాలో ఆయన ఓ లేఖను విడుదల చేయడం, అందులోని వ్యాఖ్యలను చూడటంతో, మనోజ్ మనసులో రాజకీయాలు ఉన్నాయని అంటున్నారు నెటిజన్లు.
గమ్యం లేని లక్ష్యాలు ఎన్నిటికైనా మనశ్శాంతిని దూరం చేస్తాయని వ్యాఖ్యానించిన ఆయన, మన లక్ష్యం చుట్టూ ఉన్న ప్రజలను ఉద్ధరించేలా ఉండాలని తన లేఖలో చెప్పాడు. తిరుపతికి వచ్చి, ఇక్కడి గాలిని పీల్చితే, ఏదో తెలియని శక్తి తనను ఆవహిస్తుందని, ఇక్కడి రైతుల పిల్లల విద్యకు సహాయం చేస్తానని చెప్పాడు. తన రాజకీయ ప్రస్థానం కేవలం రాయలసీమకే పరిమితం కాదని..తెలుగు రాష్ట్రాల్లో సైతం ఉంటుందని మంచు వారి అబ్బాయి అంటున్నాడు. తండ్రి సినీ వారసత్వమే కాదు..రాజకీయ వారసత్వాన్ని కూడా అందుకోబోతున్నాడన్నమాట.