ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు ఉన్నారు..అందులో కొద్ది మంది మాత్రమే సేవాతత్వంతో ముందుకు సాగుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి బ్లెడ్ బ్యాంక్ తో ఎంతో మందికి సేవ చేశారు. మరికొంత మంది హీరోలు కష్టాల్లో ఉన్న వారికి సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఈ హీరోలు ఎప్పుడో అప్పుడు ఇలాంటి సహాయాలతో ముందుకు వస్తుంటారు..కానీ సాటి వారికి సేవ చేసే మనిషిలోనే దైవం ఉన్నాడని ‘మనం సైతం’ సేవా కార్యక్రమాల ద్వారా కాదంబరి కిరణ్ నిరూపిస్తున్నారు. ఇండస్ట్రీలో ఉన్న సహనటులకే కాదు..ఇతరులు సైతం కష్టాల్లో ఉంటే..నేనున్నానంటూ ముందుకు వస్తూ సహాయం చేస్తున్నారు కాదంబరి కిరణ్ కుమార్.
టివి సిరియల్స్ లో తన నట ప్రస్థానం మొదలు పెట్టి..నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా పలు రంగాల్లో తనదైన ముద్ర వేశారు కాదంబరి. ఇప్పటి వరకు ఎంతో మంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి వైద్యం చేయించుకోలేని వారికి సహాయం అందిస్తూ..‘మనం సైతం’ ముందుకు తీసుకు వెళ్తున్నారు. తాజాగా హైదరాబాద్లోని ఫిలింఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి జయలలిత, బిగ్బాస్ విజేత కౌశల్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మణికంఠ, పి.రంగాచార్యులు, లక్కీ యాదవ్, గుమ్మోజీ భరత్ కుమార్, అంజనాదేవి, టిఎన్వి గాయత్రి, ఝాన్సీ, భాస్కర్, దిలీప్తేజలకు చెక్కులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఇక ప్రముఖ దర్శకులు పూరి జగన్నాధ్ ‘మనం సైతం’ కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత చేరువ అయ్యేలా ఓ యాప్ తయారు చేయించి ఇచ్చే బాధ్యత తీసుకున్నారు.
ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ “సేవా దృకృథం అనేది కాదంబరి కిరణ్ రక్తంలోనే ఉంది. ఇక్కడికొచ్చాకే ఆయన ఎంత పెద్ద సేవా కార్యక్రమం చేస్తున్నాడో అర్థమైంది. దేవుడు మనకు సాయం చేసినా చేయకున్నా మనకు అండగా ఉండేది సాటి మనిషే అని నేను నమ్ముతానన్నారు.ఈ కార్యక్రమంలో జయలలిత లక్ష రూపాయలు, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున అధ్యక్షుడు స్వామిగౌడ్, అనిల్, రవి లక్ష రూపాయలు, నిర్మాత బన్నీ వాసు 75 వేల రూపాయలు, కౌశల్ 25 వేల రూపాయల విరాళం ప్రకటించారు.