తమిళ నాట రజినీకాంత్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే..అయితే ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించిన మరో హీరో అజిత్ కుమార్. వీరిద్దరి సినిమాలు వస్తున్నాయంటే..తమిళ తంబీలకు పండుగే పండుగ. వారం రోజుల ముందు నుంచి థియేటర్ల వద్ద హంగామా చేస్తుంటారు. పెద్ద పెద్ద కౌటట్లు పెట్టి పాలాభిషేకాలు, స్విట్లు పంచుతూ..తెగ హల్ చల్ చేస్తుంటారు. సాధారణంగా తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సినిమాలు కాస్త గ్యాప్ తీసుకొని థియేటర్లో రిలీజ్ చేస్తుంటారు. కానీ ఈసారి వెరైటీగా సంక్రాంతి బరిలో ఇద్దరు టాప్ హీరోలు పోటీ పడుతున్నారట.
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ 'పేట్ట' అనే సినిమా చేస్తున్నారు. రజనీ లుక్ .. విభిన్నమైన కథా కథనాలు ఈ సినిమాకి ప్రధానమైన బలమని చెప్పుకుంటున్నారు. మరోవైపు శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా 'విశ్వాసం' తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ రెండూ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలే కావడంతో భారీ అంచనాలే పెరిగిపోతున్నాయి. కాకపోతే రజినీకాంత్ నటించిన కబాలి, కాలా సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినా..ఆయన క్రేజ్ తో కలెక్షన్లు నాట్ బ్యాడ్ అనిపించాయి.
ఇక వేదలం, వివేగం లాంటి సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న మంచి జోష్ లో ఉన్నాడు అజిత్ కుమార్. కాగా, కొన్ని కారణాల వల్ల ఈ రెండు సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఒకే రోజున బరిలోకి దిగుతున్నాయి. దాంతో వసూళ్లపై ప్రభావం పడుతుందని బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు సినిమాల నిర్మాతలు మాట్లాడుకుని విడుదల తేదీలను మార్చుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ కాంప్రమైజ్ అయితే ఒకే లేదంటే మాత్రం ఈ ఇద్దరు హీరోలు బరిలో ఎవరు గెలుస్తారన్నది మరో టెన్షన్..ఫ్యాన్స్ లో నెలకొంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.