స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాలకు చాల దూరంగా ఉంటాడు. చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పెట్టిన సమయంలో కూడ పవన్ కళ్యాణ్ ‘ప్రజారాజ్యం’ కోసం ప్రచారం చేసిన స్థాయిలో అలనాటి ఎన్నికల ప్రచారంలో పెద్దగా పాల్గొనలేదు. వివాదాలకు దూరంగా చాల తెలివిగా వ్యవహరించే బన్నీ నోటి వెంట ఒక రాజకీయ నాయకుడు స్థాయిలో ఉపన్యాసం రావడం చాలామందిని ఆశ్చర్య పరిచింది.
ఆశ్చర్యకరమైన ఈ సంఘటన బెంగుళూరులోని నాగార్జున కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నిర్వహించిన సభలో జరిగింది. ఈకాలేజీ యాజమాన్యం నిర్వహించిన ‘ఐక్యా ఫెస్టా 2018’ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రావడం జరిగింది. ఈ ఫంక్షన్ వేదిక పై బన్నీని చూడగానే బెంగుళూరులోని ఆ కళాశాల విద్యార్ధులు చేసిన హడావిడి పరిశీలిస్తే అల్లు అర్జున్ మ్యానియా కర్ణాటక రాష్ట్రంలో కూడ ఏవిధంగా ఉందో అర్ధం అవుతుంది.
అయితే అల్లు అర్జున్ ఈ కార్యక్రమంలో విద్యార్దులను ఉద్దేశించి చేసిన ఉపన్యాసం మాత్రం చాల విభిన్నంగా కనిపించింది. సమాజంలో ఒక వ్యక్తికి స్థాయి గౌరవం కలిగించేది ముందుగా విద్య అయితే ఆతరువాత మాత్రమే డబ్బు గౌరవాన్ని కలిగిస్తుందని అభిప్రాయపడ్డాడు బన్నీ. అంతేకాదు విద్య అందరికీ అందుబాటలో ఉండాలని కొందరికి మాత్రమే పరిమితం అయ్యే వస్తువుగా విద్య మారకూడదు అంటూ సందేశం ఇచ్చాడు.
స్టైలిష్ స్టార్ గా ఎప్పుడు నవ్వుతూ జోక్స్ వేస్తూ కనిపించే అల్లు అర్జున్ చాల గంభీరంగా కనిపించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. అంతేకాదు విద్య కోసం ముఖ్యంగా పేదలకు విద్య అందుబాటులోకి తేవడానికి తాను కొన్ని కార్యక్రమాలు చేపడతాను అని చెప్పడం బట్టి అల్లు అర్జున్ కు కూడ సామాజిక స్పృహ బాగా పెరిగిపోతోంది అనుకోవాలి..