దళపతి విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ తెలుగువారికి కూడా చిరపరిచితమైన ఎ.ఆర్.మురుగదాస్ కాంబోలో రానున్న 6 న విడుదల కానున్న క్రేజీ మూవీ సర్కార్. ఈ సినిమా పై తమిళనాట భారీ అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో తుపాకి, కత్తి వంటి సూపర్ హిట్ చిత్రాలు రావడంతో ఈ సినిమా కూడా కచ్చితంగా విజయం సాధిస్తుందని విజయ్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు.
ఈ దీపావళి కానుకగా నవంబర్ 6న సర్కార్ ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులోనూ అనువాదమవుతూ సుమారు 750 థియేటర్లలో సందడి చేయ నుంది. అయితే ‘సర్కార్’ కథ తనదేనని, తాను రాసుకున్న కథను మురుగదాస్ కాపీ కొట్టారని వరుణ్ రాజేంద్రన్ అనే వ్యక్తి ఆరోపించారు. అయితే దీన్ని మురుగదాస్ తొలుత ఖండించారు.
వాస్తవానికి వరుణ్ కథ, తన కథ ఇంచు మించుగా ఒకేలా ఉన్నా తాను వరుణ్ కథలో లేని చాలా విషయాలు పొందు పరిచానని మురుగుదాస్ మొదట్లో వాదించారు. వరుణ్ కోర్టుకు వెళ్తానని హెచ్చరించటంత్ప తానూ సిద్ధమేనని మురుగదాస్ సవాల్ విసిరారు. అందుకే సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా? అనే అనుమానాలు చాలా మందిలో నెలకొన్నాయి. తీరా వరుణ్ రాజేంద్రన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసిన తరవాత మురుగదాస్ రాజీకొచ్చారు.
తన కథను మురుగదాస్ కాపీ కొట్టారని ‘సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్’ లో మొదట వరుణ్ రాజేంద్రన్ ఫిర్యాదు చేశారు. ఆ తరవాత హైకోర్టు మెట్లెక్కారు. 2007లో తాను రాసుకున్న “సెంగల్” కథను మురుగదాస్ కాపీ కొట్టారని, కాబట్టి సినిమాలో తనను భాగం చేస్తూ ₹30 లక్షల పారితోషికం చెల్లించాలని. లేని పక్షంలో ‘సర్కార్’ విడుదలను అడ్డు కోవాలని వరుణ్ రాజేంద్రన్ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే నిన్నటి వరకు (సోమవారం) వరకు తమ మాటమీదే నిలుచున్న మురుగదాస్ బృందం మంగళవారం రాజీకొచ్చేసింది.
వరుణ్ రాజేంద్రన్ డిమాండ్ ప్రకారం అతని పేరును టైటిల్స్లో వేస్తూ, ₹30 లక్షలు పారితోషికం చెల్లించడానికి అంగీకరించారు నిర్మాతలు. ఈ విషయాన్ని వరుణ్ స్వయంగా మీడియాకు వెల్లడించారు. తన రచనను గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తన కథను విజయ్ కు, అతని తండ్రి ఎస్ఏ చంద్ర శేఖర్ కు అంకితమిస్తున్నాని వెల్లడించారు. కాగా, ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది.