తెలంగాణా ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో వివిధ రాజకీయ పార్టీలు గెలుపే ప్రధాన లక్ష్యంగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాలోని పాట తెలంగాణా ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా మారడం షాకింగ్ న్యూస్ గా మారింది. దీనితో చరణ్ మ్యానియా ను పవన్ ఉపయోగించుకోకపోయినా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడటం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది.
‘రంగస్థలం’ మూవీలోని ‘ఆగట్టునుంటావా ఈగట్టుకొస్తావా’ పాట ఇప్పటికీ జనం మరిచిపోలేకపోతున్నారు. ఈపాటను కొద్దిగా మార్పులు చేసి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో వాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కల్చరల్ విభాగానికి చెందిన ప్రముఖ గాయకుడు రసమయి ఈపాటకు మార్పులు చేసి ‘ఈగట్టులో బంగారు తెలంగాణ ఉంది ఆగట్టులో కుక్కలు చింపిన విస్తరి ఉంది’ అన్న పదాలతో ‘రంగస్థలం’ మూవీలోని పాట ట్యూన్ ను కూడ అనుసరిస్తూ చేసిన ప్రయోగం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పాటలలో హైలెట్ గా మారబోతోంది.
సెప్టెంబర్ 2వ తారీఖున హైదరాబాద్ లో జరిగిన టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రగతి నివేదన సభలో మొట్టమొదటిసారిగా ఈపాటను పాడించినప్పుడు వచ్చిన విపరీతమైన స్పందనను చూసి రసమయి సంస్థ రాబోతున్న తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఈపాటను తెలంగాణలోని ప్రతి ఊరులోను వినిపించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు రాబోతున్న ఎన్నికలకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీ ప్రతి ఊరిలోనూ పెట్టబోయే ఎన్నికల సభలో ఈ పాట హైలెట్ కాబోతోంది.
ఇది ఇలా ఉండగా మంత్రి కేటిఆర్ తన ఎన్నికల ప్రచార సభలకు సంబంధించిన ఉపన్యాసాలలో ఈపాటను ప్రస్తావిస్తూ మాట్లాడటం చరణ్ మ్యానియాను సూచిస్తోంది. అయితే అనూహ్యంగా తెలంగాణా రాష్ట్ర భవిష్యత్ కు సంబంధించిన ఎన్నికలలో కోస్తాజిల్లాల పల్లెటూరి ప్రజలు మాట్లాడుకునే పదాలను ఆలంబనగా చేసుకుని అల్లిన పాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ప్రచార పాటగా మారడంతో రాష్ట్రాలు వేరుపడినా తెలుగు ప్రజలు అంతా ఒక్కటే అన్న సంకేతాలను తెలియచేస్తోంది..