కాదేదీ కవితకు అనర్హం అని అంటుంటారు..కాదేదీ ప్రచారానికి అనర్హం అంటున్నారు ఇప్పుడు. ఆ మద్య ఓ పెళ్లి కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు గోవింద నటించిన సినిమాలోని పాటపై డ్యాన్స్ వేసి స్టెప్పులేసిన డ్యాన్సింగ్ అంకులు అందరికీ తెలిసిందే. ఒక్క వీడియో ఆయన జీవితాన్నే మార్చేసింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు డ్యాన్సింగ్ అంకులు అంటూ తెగ మెచ్చుకున్నారు. దాంతో డ్యాన్సింగ్ అంకుల్గా దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
ఓ కళాశాలలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సంజీవ్ శ్రీవాస్తవ అనుకోకుండా ఓ వివాహ వేడుకలో డ్యాన్స్ చేసి పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం ఆయన భోపాల్లోని బాబా ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన తన వృత్తితో కంటే డ్యాన్స్తోనే ఎక్కువ పేరు సంపాదించారు. డ్యాన్సింగ్ అంకుల్గా దేశవ్యాప్తంగా చిరపరిచితుడైన సంజీవ్ శ్రీవాస్తవ పై ఆ మద్య యాడ్స్ కూడా తీశారు. అంతే కాదు కొన్ని కార్యక్రమాల్లో ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి డ్యాన్స్ చేయించిన సంఘటనలు కూడా ఉన్నాయి.
ఇప్పుడు సంజీవ్ శ్రీవాస్తవపై ఇప్పుడు మధ్యప్రదేశ్ ఎన్నికల అధికారులు దృష్టిసారించారు. ఈ మద్య యువత ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఉత్సాహాన్ని చూపించడం లేదు..కొంత మంది తమకు సమయం సరిపోవడం లేదని..రాజకీయ నేతలు తమకు ఏం చేస్తున్నారని..ఓటు వేయడం వల్ల తమకు ఏంటి లాభం అని రక రకాల కారణాల వల్ల ఓటింగ్ లో పాల్గొనలేక పోతున్నారు. కాగా, ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆయనను వినియోగించుకోవాలని నిర్ణయించింది.
వెంటనే ఈ ప్లాన్ అమల్లోకి తీసుకు రావడమే కాదు.. శ్రీవాస్తవతో కలిసి ఓ ప్రచార వీడియోను రూపొందించారు. ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ఆ వీడియో ద్వారా ఆయన ఓటర్లకు పిలుపునిస్తున్నారు. విషయం తెలిసిన విదిశా జిల్లా అధికారులు కూడా ఆయనతో ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం.