నిర్మాత బెల్లంకొండ సురేష్ సినీ వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన సాయి శ్రీనివాస్ ‘అల్లుడు శీను’తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ మద్య బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ‘జయజానకీ నాయక’ సినిమాలో యాక్షన్ హీరోగా ఒక్క మెరుపు మెరిసాడు. ఆ తర్వాత వచ్చిన ‘సాక్ష్యం’సినిమాలో కూడా సెంటిమెంట్, యాక్షన్ తో బాగానే ఆకట్టుకున్నా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ అందుకోలేకపోయాడు. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కుతోన్న సినిమా ‘కవచం’. దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు ‘కవచం’ 5వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో శ్రీనివాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు.
దీపావళి సందర్భంగా విడుదలైన శ్రీనివాస్ ఫస్ట్లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు మినహా ఈ సినిమాకి సంబంధించిన టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా వస్తున్న ఈ సినిమాని నవీన్ సొంటినేని(నాని) నిర్మిస్తున్నారు. అరవై సెకన్ల పాటు సాగిన టీజర్లో… యాక్షన్, మేకింగ్ పరంగా ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో చెప్పేసింది చిత్రబృందం.
‘అనగనగా ఓ రాజు లేని రాజ్యంలో, రాకుమార్తె లాంటి కథానాయిక. తనకు రక్షణగా… కవచంలా నిలిచే పోలీస్ ఆఫీసర్’. ఈ సినిమా ఓ థ్రిల్లర్లా మలిచాడు దర్శకుడు. ఇక `పోలీసోడితో ఆడాలంటే బుల్లెట్ కంటే బ్రెయిన్ ఫాస్ట్గా పనిచేయాలి` అంటూ బెల్లం కొండ సాయిశ్రీనివాస్ పవర్ ఫుల్ గా కొట్టే డైలాగ్ చూస్తుంటే..ఈ సినిమాపై అప్పుడే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్, హర్షవర్ధన్ రానే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కీలకపాత్రల్లో నటించారు. పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, అపూర్వ ఇతర పాత్రల్లో నటించారు.