తెలుగు ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న విషయం తెలిసిదే. అలనాటి సావిత్రి జీవితంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో షర వేగంగా జరుగుతుంది. అంతే కాదు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా 'యాత్ర' సినిమా నిర్మితమవుతోంది. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం చిత్రీకరణ పూర్తైంది.
అయితే ఈ చిత్రంలో అనసూయ కర్నూలుకు చెందిన రాజకీయ నాయకురాలిగా నటించనున్నారని గతంలో వార్తలు వెలువడ్డాయి. కానీ ఇందులో ఆమె విలేకరిగా కన్పించనున్నారట. సెట్లో కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడు తీసిన ఫొటోను అనసూయ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. కాకపోతే తన పాత్రపై ఎలాంటి క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. వై.ఎస్.పాదయాత్ర ... ప్రజల ఆదరాభిమానాలు .. ప్రత్యర్థుల వ్యూహాలు .. వై.ఎస్.ప్రమాణ స్వీకారం మొదలైన అంశాలు ఈ బయోపిక్ లో వుంటాయని అంటున్నారు.
ఈ చిత్రంలో రావు రమేశ్, సుహాసిని, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని, వైఎస్సార్ సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేశ్ కనిపించనున్నారట. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ చిత్రంలో కీలక పాత్రల్లో జగపతిబాబు, సుహాసిని, రావు రమేష్, అనసూయ, సచిన్ ఖేడేకర్ తదితరుల నటిస్తున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వైఎస్సార్ కుమారుడు జగన్మోహన్రెడ్డి పుట్టినరోజుని పురస్కరించుకుని డిసెంబరు 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.