ఎన్టీఆర్ బయోపిక్కి పోటీగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ బయోపిక్ తీస్తున్నానని రామ్ గోపాల్ వర్మ కొద్దిరోజుల క్రితం విపరీతమైన హడావిడి చేసి ఆ మూవీ విషయాలను ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మార్చాడు. ఎన్టీఆర్ జీవితంలోని చీకటి కోణాలను బయటపెడతానని కుండబద్దలుకొట్టినట్టు కొన్ని రోజులక్రితం వరకు చెప్పిన వర్మ ఈ సినిమాకి సంబంధించి లక్ష్మీపార్వతి దగ్గర ముందస్తు అనుమతి కూడ తీసుకున్నాడు.
వాస్తవానికి ఈసినిమా ప్రారంభోత్సవానికీ లక్ష్మిపార్వతి కూడ హాజరు కావడంతో ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో లక్ష్మిపార్వతి తెర వెనుక పాత్ర నిర్వహిస్తారని అందరు భావించారు. అయితే వర్మ యూటర్న్ తీసుకుని ఈసినిమా తీసే ముందు స్క్రిప్టు తనకు చూపించాలన్న లక్ష్మీపార్వతి కండీషన్ ను వర్మ పట్టించు కోవడంలేదు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ నిన్న ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఈమూవీ స్క్రిప్టు లక్ష్మీపార్వతికి చూపించే ప్రశక్తిలేదని చెప్పడమే కాకుండా తానూ ఈమూవీలో ప్రతివిషయానికి లక్ష్మిపార్వతి అనుమతి అక్కరలేదు అంటూ వ్యూహాత్మక కామెంట్స్ చేసాడు వర్మ.
‘నేనో కథ చెప్పి మరో కథ తీస్తే పరిస్థితి ఏంటి అని అంటూ సినిమా అనేది పరస్పర నమ్మకంతో ముందుకెళ్లాలి అని కామెంట్స్ చేసాడు. నన్ను లక్ష్మీపార్వతి నమ్మితే చాలు స్క్రిప్టు మాత్రం ఆమెకు చూపించే ప్రశక్తే లేదు’ అని ఆ ఛానల్ లో వర్మ చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అన్నకోణంలో చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో స్టార్ డమ్ ఉన్న నటీనటులెవరూ కనిపించారు అంటూ మరో లీక్ ఇచ్చాడు వర్మ.
ఈసినిమాని 2019 జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని గతంలో వర్మ ఖచ్చితంగా ప్రకటించాడు. ఈ సినిమాను జనవరి నుంచి ఫిబ్రవరికి నెట్టేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తాను నిర్మించిన ‘భైరవ గీత’ ప్రమోషన్ లో బిజీగా ఉన్న వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయంలో అంత శ్రద్ధ పెట్టడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ఇంత హడావిడి చేసి వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను కనీసం ఫిబ్రవరిలో అయినా విడుదల చేయగలడా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..