ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మేజర్ పార్ట్ షూటింగ్ అయ్యాక.. తుదిదశలో అనుకోని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో కంగనా స్వయంగా దర్శకత్వ బాధ్యతలు తీసుకుంది. బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ ఇందులో టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణాంతర కార్యక్రమాలు ముంబయిలోని శివారు ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అయితే సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నప్పటికీ నిర్మాతలు చిత్రబృందానికి డబ్బులు చెల్లించేదట. దాంతో ఆగ్రహించిన వర్కర్లు, జూనియర్ ఆర్టిస్ట్లు, టెక్నీషియన్లు ఎక్కడి పనులు అక్కడే వదిలేసి సెట్ నుంచి వెళ్లిపోయారు.
ఇప్పటికీ తమకు రావాల్సిన డబ్బులు చెల్లించడం లేదంటూ చిత్రబృందంలోని కొందరు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్డబ్ల్యూఐసీఈ)ను ఆశ్రయించారు. ఈ మేరకు వర్కర్లు, జూనియర్ ఆర్టిస్ట్లు, టెక్నీషియన్లు ఇలా యూనిట్ సభ్యులంతా సెట్ నుంచి బయటకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైట్మెన్కి సుమారు 90 లక్షలు, జూనియర్ ఆర్టిస్టులకు సుమారు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని.. అయితే తమకు నిర్మాత కమల్ జైన్ అక్టోబర్ నెలలో డబ్బులు చెల్లిస్తానని చెప్పి ఇంకా ఇవ్వలేదని వారు పేర్కొన్నారు.
నిర్మాత కమల్ జైన్ అక్టోబర్ కల్లా బాకీ డబ్బులు ఇచ్చేస్తాం అని చెప్పారు. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. మేం కమల్కు ఫోన్ చేస్తున్నా కూడా ఆయన సమాధానం ఇవ్వడంలేదు. చిత్రీకరణ నిలిపివేస్తే వర్కర్లకు డబ్బులు చెల్లించేది లేదని బెదిరిస్తున్నారు. మాకు భీమా కూడ లేదని..ఇలా జరిగితే ఇబ్బందుల్లో పడతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం గురించి లేబర్ కమిటీ ఛైర్మన్ కిరిట్ సోమయ్యాను కలవాలని నిర్ణయించుకున్నాం’ అని ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ అశోక్ దూబే మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటికే ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంది. దీంతో జనవరి 25న విడుదల కావాల్సిన ‘మణికర్ణిక’ అనుకున్న సమయానికి వస్తుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.