తెలుగు ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’బయోపిక్. క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఎన్టీఆర్ సినీ నేపథ్యం, రాజకీయ నేపథ్యంలో కొనసాగుతుంది. అయితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. సినీ నేపథ్యంలో సాగేది ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, రాజకీయ నేపథ్యంలో సాగేది ‘ఎన్టీఆర్ మహానాయకుడు’గా జనవరి నెలలో రిలీజ్ చేయబోతున్నారు. ‘ఎన్టీఆర్’ బయోపిక్ చిత్రంపై అభిమానుల్లో రోజు రోజుకూ అంచనాలు పెంచేస్తోంది చిత్రబృందం.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ వస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేస్తూ ఈ మూవీ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ‘ఘన కీర్తిసాంధ్ర విజితాఖిలాంధ్ర మణిదీపకా ఓ కథానాయకా’… అంటూ అచ్చ తెలుగు పదాలతో తెలుగువారి గొప్పతనాన్ని వర్ణిస్తూ… అన్న ఎన్టీఆర్ శైలిని వర్ణిస్తూ సాగిన పాట వీనులవిందుగా ఉంది.
ఎమ్.ఎమ్ కీరవాణి అద్భుతమైన స్వరాలను సమకూర్చగా.. ఆయన తండ్రి శివశక్తి దత్తా సాహిత్యం అందించారు. విలక్షణ గొంతుతో సింగర్ కైలాష్ ఖేర్ ఈ పాటకు ప్రాణం పోశారు. ఈ పాటలోని ప్రతి పదం ఎన్టీఆర్ సినీ జీవితాన్ని కనుల ముందు ఆవిష్కరించినట్లు వినిపిస్తుంది. మొత్తానికి క్రిష్ ‘ఎన్టీఆర’బయోపిక్ పై అన్ని రకాలుగా శ్రద్ద తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సాంగ్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.