తెలుగు ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో మొదటి సారిగా ఎన్టీఆర్ నెగిటీవ్ షేడ్స్ లో నటించారు. ఇక క్లయిమాక్స్ కి ముందు వచ్చే కోర్టు సీన్లు ఆడియన్స్ ని మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించాయని చెప్పొచ్చు. మొత్తానికి ఎన్టీఆర్ కెరీర్ లో మంచి హిట్ చిత్రంగా ‘టెంపర్’మిగిలిపోయింది. తాజాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్, కోలీవుడ్ లో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ లో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో కరణ్జోహార్, రోహిత్శెట్టి సంయుక్తంగా ‘సింబా’చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
చిత్రంలో సారా అలీ ఖాన్ హీరోయిన్గా నటించింది. ఇక తెలుగులో టెంపర్ సినిమాకి మణిశర్మ అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వగా.. హిందీలో తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ట్రైలర్ పై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బాజీరావు సింగంగా అజయ్ దేవ్గణ్ ఈ మూవీలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఆయన వాయిస్ ఓవర్తో ప్రారంభమైన ‘సింబా’ ట్రైలర్లో చేతిపై పోలీస్ అనే టాటూ వేసుకుని పోలీస్ అని అరుస్తూ.. అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు రణ్ వీర్ సింగ్.
ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్ పూర్తి యాక్షన్ తో పాటు కామెడీ, రొమాన్స్ అన్ని చూపించారు. ఇక ట్రైలర్ మొత్తం భారీతనంతో నింపేసినా ‘టెంపర్’ చూపించలేకపోతుంది ‘సింబా’ ట్రైలర్. పూరీ ఇంటెన్సిటీ రోహిత్ శెట్టి ‘సింబా’ చిత్రంలో మిస్ అయ్యిందని అంటున్నారు. క్లైమాక్స్ ట్విస్ట్ లో మార్పులు ఉండవు గాని నార్త్ జనాలకు నచ్చే విధంగా దర్శకుడు సీన్స్ ను డిజైన్ చేసుకున్నట్లు సమాచారం.
ఇక చిత్రంలో ప్రకాశ్ రాజ్ పాత్రలో విలన్ గా సోనూసూద్ నటిస్తున్నారు. ఇక సినిమాను డిసెంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. పెళ్లి తరువాత రన్ వీర్ సింగ్ నుంచి వస్తోన్న మొదటి సినిమా ఇదే.
ఇక తమిళ్లో టెంపర్ చిత్రాన్ని విశాల్ హీరోగా ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్నారు.