నిక్ జొనాస్ తో వివాహనంతరం మధురానుభూతుల ఆస్వాదనలో తరిస్తుండగానే కళ్యాణంతో జోడీగా మరో శుభవార్త ఆమె ఆనందాన్ని రెట్టింపు చేసింది. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళలు పేరిట ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ మాగజీన్ విడుదల చేసిన జాబితా లో ప్రియాంక చోప్రాకు 94వ స్థానం దక్కింది.
భారతీయ సినీరంగం నుంచి ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్న ఏకైక భారతీయురాలు ప్రియాంకే కావడం విశేషం. కాగా ఆమె ఈ జాబితాలో చోటు దక్కించు కోవడం రెండో సారి. ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ జాబితా లో అత్యంత శక్తిమంతమైన మహిళగా రెండోసారి నిలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నేను ప్రేమించే పనిని కొనసాగిస్తూ మరింత ఎదగాలి ఆమె ఇది గుర్తు చేసిందని ప్రియాంక పోస్ట్ చేసింది.
ఇంకో విషయం ఏమంటే ఈ బాలీవుడ్ అందాల నటి ప్రియాంకా చోప్రా, అమెరికన్ గాయకుడు నిక్ జోనస్ ఇటీవల పెళ్లి చేసుకున్న సందర్భంగా — వారి వివాహబంధంపై న్యూయార్క్ కు చెందిన ది కట్ అనే మ్యాగజీన్ లో వచ్చిన కథనంపై ప్రియాంకా చోప్రా మండిపడ్డారు. ఇలాంటి పిచ్చి కథనాలను నేను పట్టించుకోను. అసలు దీని గురించి కామెంట్ చేయాలని కూడా అనుకోవడంలేదు. ఇలాంటివి నా పరిధిలోకి రావు కూడా. ప్రస్తుతం నేను సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను. ఇలాంటి వార్తలు నన్ను ఏ విధం గానూ డిస్టర్బ్ చేయలేవు అన్నారు ప్రియాంక కాస్త కటువుగానే.
ఇంతకీ ది కట్ మ్యాగజీన్ కథ ఏమంటే! ప్రియాంక గురించి ఆ పత్రిక విలేకరి మరియా స్మిత్ ఘాటుగా రాశారు:
"అసలు ప్రియాంక, నిక్ జోనస్ ల ప్రేమ నిజమేనా? పాపం! నిక్.. అందరి కుర్రాళ్ల లాగే కాలక్షేపానికి కొద్దిరోజులు ప్రియాంకతో ప్రేమాయణం సాగించి వదిలేద్దా మని అనుకున్నాడు. కానీ, గ్లోబల్ స్కామ్ ఆర్టిస్ట్ అయిన ప్రియాంక చోప్రా ఏకంగా అతన్ని వివాహం చేసుకునేలా చేసింది. పెండ్లి పేరుతో నిక్ ను శాశ్వతంగా కట్టేసుకుని, ఆయనకు యావజ్జీవ శిక్ష విధించింది" అని
ఇవి జాతి వివక్ష తో కూడిన వ్యాఖ్యలు అంటూ ఆ పత్రికపై తీవ్రమైన విమర్శలు రావడంతో చివరకు ఆ పత్రిక క్షమాపణలు చెప్పింది. సోనమ్ కపూర్, నిక్ సోదరుడు జో జోనస్, హాలీవుడ్ నటి సోఫీ టర్నర్ వంటి పలువురు ప్రియాంక గురించి సదరు పత్రిక అలా రాయడం సరి కాదని సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.