సాధారణంగా మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన వార్తలు ఇట్టే వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు తెలంగాణలో పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు క్యూలో నిల్చుని మరీ వేసి వెళ్తున్నారు. అంతే కాదు తాము ఓటు వేశామని..ఓటు వేయడం అందరి బాధ్యత అంటూ సందేశాలను ఇస్తూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. తాజాగా హైదరాబాదు ఫిలింనగర్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేసేందుకు వచ్చిన సందర్భంగా దర్శక దిగ్గజం రాఘవేంద్రరావుకు చేదు అనుభవం ఎదురైందని వార్తలు పలు ఛానల్స్ లో రావడంతో ఈ వార్త కాస్త వైరల్ గా మారింది.
ఆయన నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్లగా కొంత మంది ఓటర్లు ఆయనను అడ్డుకున్నారని..సెలబ్రెటీలు అయినంత మాత్రాన అలా ఓటు వేయవొద్దని..తామంతా క్యూలైన్లో నిల్చున్నామని..అలాగే ఆయన కూడా క్యూలో నిలబడి ఓటు వేయాలని అభ్యంతరం చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దాంతో రాఘవేంద్ర రావు అలిగి అక్కడ నుంచి వెళ్లిపోయాడంటూ వార్తలు టాం టాం అయ్యాయి. దీనిపై స్పందించిన రాఘవేంద్ర రావు ఈ వార్తల్లో నిజం లేదని ఖండించారు.
మీడియాతో మాట్లాడుతూ..క్యూలో నిలబడలేక నేను వెళ్లిపోయానని టీవీలో వచ్చింది. ఓటు వేయడానికి వచ్చినప్పుడు క్యూ పెద్దదిగా ఉంది. నాకు వేరే అర్జెంట్ పని ఉండటంతో వెళ్లిపోయాను. అంతే కాదు నేను అక్కడ ఉన్న సమయంలో ఏ ఓటరూ నాకు అభ్యంతరం చెప్పలేదని..ఇవన్నీ కల్పితాలని ఆయన అన్నారు. అంతే కాదు నేను బాధ్యత కలిగిన వ్యక్తిని. ఇతరుల మీద అలిగి వెళ్లిపోయేంత కుసంస్కారం కలిగిన వ్యక్తిని కానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛానల్స్ వార్త వేసేముందు.. దయచేసి మమ్మల్ని కూడా సంప్రదించి వేయండి' అని తెలిపారు. పోలింగ్ ఏర్పాట్లను చాలా బాగా చేశారని కితాబిచ్చారు.