మీటూ ఉద్యమం పుణ్యమా అని గతంలో జరిగిన అనేక విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమకు గతంలో జరిగిన లైంగిక వేధింపుల గురించి నోరువిప్పుతున్నారు. కొందరు కావాలని మీడియా ముందుకు వచ్చి చెబుతుంటే.. మరికొందరు ఇంటర్వ్యూల్లో అడిగినప్పుడు పాత విషయాలు నెమరు వేసుకుంటున్నారు.
ఇటీవల అలనాటి హీరోయిన్ ఖుష్భూ కూడా తన జ్ఞాపకాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. తెలుగులో తన మొదటి సినిమా కలియుగ పాండువులు అన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ ఓ పళ్లెటూళ్లో జరుగుతోందట. సాయంత్రం షూటింగ్ పూర్తయి మేడ మీదకు వెళ్తోందట హీరోయిన్ ఖుష్బూ. ఆ సమయంలో ఓ వ్యక్తి వెనుకనుంచి ఖుష్బూను ఫాలో అయ్యాడట.
మెట్లెక్కుతున్నప్పుడు వెనుక నుంచి అసభ్యంగా టచ్ చేశాడట. అంతే.. ఖుష్బూ క్షణం ఆలోచించకుండా వెనక్కు తిరిగి చెంప చెళ్లుమనిపించిందట. ఆ సమయంలో నిర్మాత సురేశ్ బాబు, ఇతరులంతా తనను సపోర్ట్ చేశారంటూ తన మీ టూ జ్ఞాపకాన్ని బయటపెట్టింది అలనాటి హీరోయిన్ కమ్ నేటి పొలిటీషియన్ ఖుష్బూ.
అదే సమయంలో తనకు వచ్చిన లవ్ ప్రపోజల్స్ గురించి కూడా ఖుష్బూ కొన్ని విషయాలు చెప్పింది. తనకు చాలా ప్రపోజల్స్ వచ్చాయని... ఇప్పుటికీ కొందరు లవ్ ప్రపోజ్ చేస్తుంటారని చెబుతోంది. తన భర్త దర్శకుడు సుందర్ కూడా తన మొదటి సినిమా దర్శకత్వం సమయంలోనే లవ్ ప్రపోజల్ చెప్పారని.. అతని నిజాయితీ చూసి వెంటనే ఓకే చెప్పేశానని చెబుతోంది ఖుష్బూ.