2019లో ఏపీలో జరిగే ఎన్నికలే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ఎత్తులు- పైఎత్తులు వేస్తున్నారు. వరుస పర్యటనలతో జోరు పెంచారు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో సినిమాలు చేసేది లేదని కూడా చెప్పేశారు. ఇక మిగిలిన జీవితం రాజకీయాలకే అంకింతం అని చెబుతున్నారు. అయితే ఇప్పటికీ పవన్ కల్యాణ్ కు బంపర్ ఆఫర్లు వస్తున్నాయట.
ఇటీవలే ఓ ప్రముఖ సంస్థ ఓ టీవీ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ ను వ్యాఖ్యాత ఉండమని కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఐతే.. తన దృష్టి ప్రస్తుతం పూర్తిగా రాజకీయాలపైనే ఉందని.. అలాంటి కార్యక్రమం చేయలేనని పవన్ సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఇంకా ఎన్నికలకు కేవలం కొన్ని నెలల సమయం మాత్రమే ఉండటంతో పవన్ నో చెప్పేశారట.
ఇంతకీ ఆ షో ఏమిటనుకుంటున్నారా.. అదే సత్యమేవ జయతే కార్యక్రమం. హిందీలో దీన్ని ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ ఆ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించారని పేరు వచ్చింది.
తెలుగులో పవన్ కల్యాణ్ కు సామాజిక సేవ నేపథ్యం ఉంది కాబట్టి పవన్ కల్యాణ్ అయితేనే బావుంటుందని అనుకున్నారట. కానీ బంపర్ ఆఫర్ ఇచ్చినా పవన్ నో చెప్పేశారు. ఇక ఇప్పుడు వేరే నటుడిని వెదికే పనిలో ఉందట సత్యమేవ జయతే టీమ్.