హైదరాబాద్ శివారు లోని తన గెస్ట్ హౌస్ ను సీజ్ చేయడం తో ప్రభాస్ హై కోర్ట్ ను ఆశ్రయించాడు. అయితే అసలేంటి కథ.. అంటే, భూ వివాదాల విషయంలో సామాన్యులైనా, సెలబ్రిటీలైనా ఒకటే. ఒకే భూమిని చాలామందికి అమ్మేసే కేటుగాళ్ళకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు వింటూనే వుంటాం. వివాదాస్పద భూముల్ని అంటగట్టేవాళ్ళూ, లేని భూమిని వుందని చూపించి అమ్మేసే ముఠాలు.. వీటికి సంబంధించి మీడియాలో వచ్చే కథనాలూ షరామామూలే. సెలబ్రిటీలు, సామాన్యులు భూ కొనుగోళ్ళ సందర్భంగా ఇబ్బందులు పడ్తుండడమూ మామూలే.
ప్రభాస్ కూడా ఇప్పుడు అదే సమస్య ఎదుర్కొంటున్నాడు. ఎవరో అమ్మిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడటగానీ, ఆ తర్వాత అది వివాదాస్పద భూమి అని తేలిందట. రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేయగా, ఆ దరఖాస్తు ప్రస్తుతం పెండింగ్లో వుంది. ఈలోగా న్యాయస్థానం, ఆ స్థలాన్ని ప్రభుత్వానికి చెందేలా ఆదేశాలు జారీ చేయడంతో కథ అడ్డం తిరిగింది.
ప్రస్తుతం ప్రభాస్, తన స్థలానికి సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. న్యాయస్థానం ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. న్యాయస్థానంలో ప్రభాస్ తరఫు లాయర్ వాదనలు, అవతలి వైపు వాదనలు.. ఇదంతా ముగిసి.. అసలు మేటర్ ఎప్పటికి ఓ కొలిక్కి వచ్చేనో ఏమో.! ఈలోగా ప్రభాస్, అడ్డగోలుగా వివాదాస్పద భూమిని ఆక్రమించాడనీ, ప్రభుత్వం ప్రభాస్పై కత్తిగట్టిందనీ.. సోషల్ మీడియా వేదికగా రచ్చ మాత్రం ఓ రేంజ్లో జరిగిపోతోంది.