టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లలో ఒకరు క్రిష్. ఈయన తీసిన సినిమాలు దాదాపు అన్ని హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు ‘కంచె’జాతీయ అవార్డు కూడా దక్కించుకుంది. ప్రస్తుతం క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో ‘ఎన్టీఆర్ బయోపిక్’రూపొందుతుంది. ఈ సినిమా జనవరిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఎన్టీఆర్ జీవితం సినీ, రాజకీయ నేపథ్యంలో కొనసాగింది కనుక ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారు. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’.
చారిత్రాత్మక సినిమాలు తీయడంలో క్రిష్ కి మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో చారిత్రక నేపథ్యంలో వీరనారి ఝాన్సీ జీవిత చరిత్ర ఆధారంగా ‘మణికర్ణిక’సినిమా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. అనుకోని పరిస్థితుల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకున్నారు. కాకపోతే 70 శాతం వరకు క్రిష్ పూర్తి చేసినట్లు సమాచారం.
ఆ తర్వాత దర్శకత్వం బాధ్యతలు హీరోయిన్ కంగనారౌనత్ చేపట్టింది. దీనిపై పెద్దగా వివాదం జరగలేదు. ఎందుకంటే దర్శకునిగా క్రిష్ పేరును యూనిట్ ప్రస్తావిస్తోంది. టీజర్లో కూడా క్రిష్ పేరు వేశారు. కాకపోతే రెండు రోజుల క్రితం ట్రైలర్ విడుదల చేయగా అందులో దర్శకులుగా క్రిష్తో పాటు కంగనా పేరు కనిపించింది.
ట్రైలర్ విడుదల సందర్భంగా క్రెడిట్ అంతా తనదే అన్నట్టుగా కంగనా మాట్లాడిన తీరు బాలీవుడ్లో చర్చనీయాంశం అయింది. అంతే కాదు ఆ సమయంలో క్రిష్ పేరు ప్రస్థావించక పోవడం పై విమర్శలు తలెత్తుతున్నాయి. క్రిష్ పేరు చెప్పనప్పటికీ, సినీ ప్రపంచానికి ఆయనే కర్త కర్మ క్రియ అని తెలుసు.