ఈ మద్య పెద్ద సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే నెట్టింట్లో ప్రత్యక్షం అవుతున్నాయి. ఓ వైపు కోట్లు పెట్టి తాము సినిమాలు నిర్మిస్తే..రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే నెట్ లో రావడం నిర్మాతలకు మింగుడు పడటం లేదు. మరోవైపు ప్రభుత్వం పలు వెబ్ సైట్లపై చర్యలు తీసుకుంటున్నా..ఈ పైరసీ రక్కసిని మాత్రం అరికట్టలేక పోతుంది. ఆ మద్య సుమారు రూ.500 వందల కోట్ల నిర్మాణంతో 2.0 సినిమా తీస్తే..నెట్ ప్రత్యక్షం కావడం పై డైరెక్టర్ శంకర్, లైకా సంస్థ తీవ్రంగా స్పందించింది. కానీ, ఆ పైరసీని మాత్రం అరికట్టలేక పోయింది. కొన్ని సినిమాలైతే రిలీజ్ కన్నా ముందే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా పరిస్థితి అంతే..కానీ అదృష్టం బాగుండి సినిమా హిట్ కావడంతో బయ్యర్లు, నిర్మాత లాభాన పడ్డారు. దేశంలో ఏ ఇండస్ట్రీ అయినా సరే ఈ పైరసీ బారిన పడాల్సి వస్తుంది. పైరసీకి భాషా భేదం, ప్రాంతీయ భేదం లేదు ఓ మహమ్మారిలా తయారైంది. ముఖ్యంగా తమిళ రాకర్స్, తమిళ బాక్స్ అనే సంస్థలు సినిమా రిలీజైన రోజే పైరసీని మార్కెట్లోకి తీసుకొచ్చి నిర్మాతల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. పైరసీ భూతాన్ని అరికట్టేందుకు చిత్రపరిశ్రమ ఎన్నో రకాల ఆలోచనలు చేస్తుంది.
కానీ కొత్త కొత్త టెక్నాలజీతో ఈ పైరసీ మాత్రం రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. తాజాగా ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన జీరో సినిమా కూడా పైరసీ బారిన పడింది. తొలి రోజే తమిళ రాకర్స్ సంస్థ సినిమాని పైరసీ చేసి ఆన్లైన్లో ఉంచింది. దీంతో జీరో సినిమాకి బిజినెస్ భారీగా తగ్గుతుందనే టాక్ వినిపిస్తోంది. అసలే ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. దీంతో జీరోపై పైరసీ ప్రభావం తప్పక ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జీరో చిత్రంలో షారూఖ్ మరుగుజ్జుగా కనిపించగా, అనుష్క దివ్యాంగురాలిగా దర్శనమిచ్చింది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ సినీ నటిగా కనిపించగా..ఓ పాటలో అందాల తార శ్రీదేవి కనిపించింది.