తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరు పదుల వయస్సులోను యువ హీరోలతో సమానంగా నటిస్తున్నారు. ఒకప్పుడు డైరెక్టర్ శంకర్, రజినీ కాంబినేషన్ లో వచ్చిన రోబో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ సినిమా సీక్వెల్ గా రూపొందిన 2.0 మూవీ మరో ఘన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 800 కోట్లు వసూళ్లు చేసినట్లు అంచనా. 2.0 సినిమా పూర్తయిన తర్వాత కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ ‘పేట్టా’మూవీలో నటిస్తున్నారు. తాజాగా రజనీ పెట్టా సినిమా షూటింగ్ ను సైతం పూర్తి చేసుకున్నారు.
ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదల కాగా ఇందులో రజనీకాంత్ స్టిల్స్ ప్రేక్షకులకి అమితానందాన్ని కలిగిస్తున్నాయి. త్వరలో మురుగదాస్తో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం రజినీకాంత్ తన కుటుంబ సభ్యులతో సైలెన్స్ గా అమెరికా పయణం అయినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలోనూ రజనీ తరచుగా అమెరికాలో ఆరోగ్య పరీక్షలు చేయించుకునేవారనీ, కానీ రోబో 2.0 షూటింగ్ కారణంగా అది వాయిదా పడటంతో ఇప్పుడు వెళుతున్నారని స్పష్టం చేశాయి.
అభిమానులు కంగారు పడాల్సిన విషయం ఏమీలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 10 వరకూ రజనీ అమెరికాలోనే గడపనున్నారు. ఆయన భారత్ కు తిరిగివచ్చాక మురుగదాస్ దర్శకత్వంలో కొత్త సినిమా మొదలుకానుంది. ఈ సినిమా షూటింగ్ 2019, మార్చి నుంచి ప్రారంభం అవుతుంది.