తమిళ నాట జయలలితకు ఎంత పేరు ఉందో అందరికీ తెలిసిందే. సినీ నటిగా తన కెరీర్ ప్రారంభించిన జయలలిత తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తమిళనాట స్టార్ హీరోగా వెలిగిపోయిన ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా రాజకీయ రంగంలోకి ప్రవేశించిన జయలలిత ఎదురులేని నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ తరుపు నుంచి ఆమె ముఖ్యమంత్రిగా పలుమార్లు ఎన్నికై తమిళ ప్రజలకు ‘అమ్మ’గా ఎన్నో సేవలు అందించారు. అయితే తమిళనాడులో జయలలితకు నిచ్చెలిగా శశికళ ఆమె రాజకీయ జీవితంలో ముఖ్య పాత్ర పోషించారు.
జయలలిత మరణించిన తర్వాత తమిళనాడులో రాజకీయంగా ఎన్నో చిత్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలనుకున్న శశికళ ఆశలు ఆవిరయ్యాయి..అక్రమార్జన కేసులో ఆమెకు నాలుగేళ్లు జైలు శిక్ష పడింది. ప్రస్తుతం బయోపిక్ సినిమాలు వరుసగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే జయలలిత బయోపిక్ సినిమాలు ఒకటి కాదు రెండు ఏకంగా నాలుగు తెరకెక్కించబోతున్నారు దర్శక నిర్మాతలు.
ప్రముఖ దర్శకులు గౌతమ్ మీనన్ ఓ మెగా సీరియల్ కే ప్లాన్ చేస్తున్నారు. తమిళ ప్రజల ఆరాధ్య నేత జయలలిత జీవిత కథ ఆధారంగా కోలీవుడ్లో పలు బయోపిక్లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలో జయలలిత స్నేహితురాలైన శశికళ పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. దీని గురించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సాయి పల్లవి వరుస ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. తెలుగులో ఆమె నటించిన ‘పడి పడి లేచె మనసు’, తమిళంలో నటించిన ‘మారి’సినిమాలు గత శుక్రవారం విడుదలై మంచి టాక్ అందుకున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో సాయిపల్లవికి మంచి క్రేజ్ ఉంది.