మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటాడు. దీనికితోడు అతడు సోషల్ మీడియాకు కూడా చాలదూరంగా ఉంటాడు కాబట్టి అతడి అభిప్రాయాలు కేవలం అతడి సన్నిహితులకు తప్ప మరెవ్వరికీ పెద్దగా తెలియవు. ఇలాంటి పరిస్థితులలో త్రివిక్రమ్ నిన్న ‘వినయ విధేయ రామ’ ఫంక్షన్ లో చేసిన కామెంట్స్ కొంతమందికి తీవ్ర అసహనాన్ని కలిగించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
నిన్నటి ఫంక్షన్ లో త్రివిక్రమ్ చరణ్ పై విపరీతమైన ప్రశంసలు కురిపిస్తూ చరణ్ ను సింహంతో పోల్చాడు. సింహం రోజూ వేటాడదని ఆకలి వేసినప్పుడు మాత్రమే అడవిలోకి వెళ్తుందని అంటూ అప్పుడు మాత్రం వేట సాలిడ్ గా ఉంటుందని ఒక కథ చెప్పుకొచ్చాడు. అయితే అంతటితో ఆగకుండా మరొక షాకింగ్ కామెంట్ చేసాడు. సింహం వేటాడి తినగా వదేలేసిన ఆవేటతో చాల రోజులు పాటు నక్కలు హైనాలు పండగ చేసుకుంటాయని కామెంట్ చేసాడు త్రివిక్రమ్.
ఈవిషయాలు అన్నీ సింహానికి సంబంధించిన వాస్తవాలు అయినా త్రివిక్రమ్ మాటలు చరణ్ సినిమాల బాక్సాఫీస్ కు అన్వయించే విషయంలో త్రివిక్రమ్ ఇలా అత్యుత్సాహంతో కామెంట్ చేసి ఉంటాడు అని చాలామంది భావిస్తున్నారు. తన పొగడ్తలతో చరణ్ ను సింహం చేసిన త్రివిక్రమ్ మిగతా హీరోలను నక్కలు హైనా లుగా మార్చాడు అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.
అంతేకాదు త్రివిక్రమ్ భవిష్యత్ లో చాలామంది హీరోలతో సినిమాలు చేస్తూ తన లాంగ్ కెరియర్ కొనసాగించవలసిన పరిస్థుతులలో కేవలం చరణ్ ను పొగడటం కోసం మిగతావారిని నక్కలు హైనాలుగా మార్చడంలోని ఆంతర్యం ఏమిటి అంటూ త్రివిక్రమ్ మాటల వెనుక అర్ధాలు వెతుకుతున్నారు. అయితే ఎప్పుడు పొదుపుగా మాట్లాడుతూ తన డైలాగ్స్ విషయంలో కూడ పొదుపును పాటించే త్రివిక్రమ్ నిన్న అనుకోకుండా చేసిన కామెంట్స్ వల్ల అనవసరపు రగడులో చిక్కుకున్నాడనుకోవాలి..