ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్నాయి. ప్రస్తుతం జీవించి ఉన్నవారు..ఒకప్పుడు దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తీసుకు వచ్చిన వారి జీవితాలపై బయోపిక్ లు వస్తున్నాయి. సినీ, క్రీడా, రాజకీయ రంగాల్లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి పేరు తెచ్చుకున్నవారి జీవితాలపై బయోపిక్ చిత్రాలు వస్తున్నాయి. ఇప్పటికే సినీ నేపథ్యంలో మహానటి, సంజు చిత్రాలు వచ్చాయి. రాజకీయ నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్సార్, జయలలిత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ త్వరలో అబ్దుల్ కలాం ల బయోపిక్ లు రాబోతున్నాయి.
తాజాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్'. ఈ చిత్రం ట్రైలర్ పై ఓ వైపు కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో అంతా అనవసరమైన కల్పితాలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో మన్మోహన్ సింగ్ పాత్రను బీజేపీ నేత, ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ పోషించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మన్మోహన్ సింగ్ పాత్రను పోషించడం ఓ సవాల్ అనిపించిందని, అయినప్పటికీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచానని చెప్పారు.
మన్మోహన్ పాత్రలో జీవించానని, తన తల్లి కూడా తనను గుర్తుపట్టలేనంతగా ఆ పాత్రలో ఒదిగిపోయానని అన్నారు. మన దేశంలో నటన కన్నా నిరసనలకే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టుగా కన్పిస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కచ్చితంగా, ఆస్కార్ అవార్డుకు తాను నామినేట్ అవ్వాల్సిందేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు, బెదిరింపులు తనను నిరాశకు గురిచేస్తున్నాయని అనుపమ్ ఖేర్ ఆవేదన వ్యక్తం చేశారు.