ఈ సంవత్సరం సంక్రాంతి రేసుకు ఏకంగా నాలుగు భారీ సినిమాలు విడుదల అవుతున్న నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలలోని ధియేటర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాలలోని ధియేటర్లలో చాల భాగం దిల్ రాజ్ అల్లు అరవింద్ సురేశ్ బాబుల చేతిలో ఉండటంతో వీరి అనుగ్రహం పై సంక్రాంతి సినిమాల విజయం ఆధారపడిన పరిస్థితి ఏర్పడింది.
ఇలాంటి నేపథ్యంలో రజనీకాంత్ ‘పెట్టా’ ను తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత వల్లభనేని అశోక్ నిన్న ఈసినిమాకు సంబంధించి జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దిల్ రాజ్ అల్లు అరవింద్ లను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ధియేటర్ల మాఫియా కొనసాగుతోందని దానిని అడ్డుకోమని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కోరడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.
అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీని శాసిస్తున్న కొందరి పెత్తనం తగ్గించకపోతే భవిష్యత్ లో ఎవరు సినిమాలు తీయలేరని వల్లభనేని అశోక్ అభిప్రాయపడుతున్నాడు. అయితే ధియేటర్ల మాఫియా అంటూ అశోక్ దిల్ రాజ్ అల్లు అరవింద్ ల పేర్లు చెప్పిన అశోక్ సురేశ్ బాబు పేరు ఎందుకు చెప్పలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
వాస్తవానికి సురేశ్ బాబు ఎన్టీఆర్ బయోపిక్ కు భారీ సినిమాల నుండి పోటీ లేకుండా ‘కథానాయకుడు’ ను విడుదల చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసాడు అన్న వార్తలు ఉన్నాయి. దీనికోసం సురేశ్ బాబు అల్లు అరవింద్ దిల్ రాజ్ లతో రాయబారాలు చేసినా అవి ఫలించలేదు అన్న వార్తలు కూడ వచ్చాయి. దీనితో సురేశ్ బాబు అసహనం వల్లభనేని అశోక్ మాటలు ద్వారా బయటకు వచ్చిందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇంత హడావిడితో విడుదల అవుతున్న ‘పెట్టా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రజినీకాంత్ హాజరు అవ్వకపోవడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది..