ఈ మద్య వరుసగా బయోపిక్ సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగులో మహానటి సినిమా రిలీజ్ అయి మంచి విజయం అందుకుంది..నేడు ఎన్టీఆర్ బయోపిక్ నుంచి ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ లో ప్రముఖ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా సంజు సినిమా తీశారు. ఇక తెలుగు లో వైఎస్సార్ జీవిత కథ ఆధారంగా యాత్ర, కాంతారావు సినిమాలు రాబోతున్నాయి. ఇక తమిళ రాజకీయాల్లో ఎన్నో సంచలనాలు సృష్టించిన జయలలిత బయోపిక్ తీయడానికి రంగం సిద్దం అవుతుంది.
బాలీవుడ్ లో మాజీ ప్రధాని మన్ మోహన్ సింగ్, అబ్దుల్ కలాం త్వరలో పీఎం నరేంద్ర మోదీ బయోపిక్ లు కూడా రాబోతున్నాయి. ఇక సినీ నేపథ్యంలో పలు బయోపిక్ సినిమాలు తీయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఈ నేపథ్యంలో బాలనటిగా కన్దన్ కరుణాయ్ (1967) అనే తమిళ చిత్రంతో మొదలు పెట్టిన శ్రీదేవి అంచెలంచెలుగా ఎదిగింది. తొలుత తమిళ, మలయాళ సినిమాల్లో నటించారు. తెలుగు సినీ రంగాన్ని దాదాపు నాలుగు దశాబ్దాలకుపైగా రెండు తరాల హీరొలతో నటించి రికార్డు సృష్టించారు శ్రీదేవి. 50 ఏళ్లు దాటినా శ్రీదేవి చాలామందికి అతిలోక సుందరే . ఆమెని అభిమానించే అభిమానులు ఇప్పటికి చాలా మందే ఉన్నారు.
కేవలం మనదేశంలోనే కాదు విదేశాలలోను శ్రీదేవిపై అంతులేని అభిమానం సంపాదించారు. ప్రస్తుతం అంతటా బయోపిక్ల సీజన్ నడుస్తుండగా, శ్రీదేవి జీవిత నేపథ్యంలో ఓ సినిమా చేయాలని పలువురు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారికంటే ముందే బోని.. శ్రీదేవి బయోపిక్ చేయాలని అనుకుంటున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేయనున్నాడని సమాచారం. అంతే కాదు పుస్తక రూపంలోను శ్రీదేవి జీవితాన్ని ప్రజల ముందుకు తీసుకురానున్నాడట బోని. మరి శ్రీదేవి పాత్ర కోసం ఏ నటిని ఎంపిక చేసుకుంటారో చూడాలి.