తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్ కథనాయకుడు ప్రేక్షకుల ముందు వచ్చేసింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాలయ్య స్వయంగా నిర్మించి నటించిన ఈ చిత్రం ఎన్టీఆర్ స్థాయిలోనే ఉందని అభిమానులు సంబరపడుతున్నారు.
సాధారణంగా ఎన్టీఆర్ జీవితాన్ని ఓ సినిమాలోనో, రెండు పార్టుల్లోనో ఇమడ్చం అంత సులభమైన ప్రక్రియ కాదు. కానీ దర్శకుడు క్రిష్ తక్కువ సమయంలోనే ఈ సినిమాను సాధ్యమైనంత జనరంజకంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో ప్రత్యేకించి కొన్ని సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి.
సినిమా ఫస్ట్ హాఫ్లో రాయలసీమ కరువు సన్నివేశాన్ని బాగా చూపించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ మరణం సన్నివేశం హృదయాలను కదిలిస్తుంది. ఫస్ట్ హాఫ్ చివరిలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి పాత్ర పోషించిన సన్నివేశం సినిమాకే హైలెట్ గా చెబుతున్నారు. నందమూరి అభిమానులైతే ఈ సన్నివేశంలో రోమాంఛితులవుతున్నారు.
ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. ఇది రాజకీయ రంగప్రవేశానికి పూర్వభాగం కనుక.. ఆ కంక్లూజన్కు తీసుకొచ్చేందుకు కాస్త నిడివి ఎక్కువే తీసుకుంది. దివిసీమ ఉప్పెన సీన్ను క్రిష్ రక్తికట్టించారు. ఎన్టీఆర్-ఏఎన్నార్ సీన్ ఎన్టీఆర్ అంతర్మథనాన్ని ఆవిష్కరించింది. చివరగా ఎన్టీఆర్ పార్టీ ప్రకటన సన్నివేశం సినిమాను పతాకస్థాయికి తీసుకెళ్లింది.