ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించి ఓట్లేయించుకునే విషయంలో ప్రచార పర్వానిది అతి ముఖ్యమైన మరియు కీలక పాత్ర. తమ తమ పార్టీ అభ్యర్థులను జనాలకు దగ్గర చేసేందుకు పాటీలు వివిధ పద్దతులను అనుసరిస్తూ ఉంటారు. ఎన్నికల ప్రచార సభలకు వచ్చే ప్రజలు అభ్యర్థుల బలప్రదర్శనకు ఉపయోగపడుతుంది. అందుకే ప్రచార పర్వంలో అన్ని పార్టీల అభ్యర్థులు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. జనాన్ని ప్రచారసభలకు సమీకరించేందుకు ప్రత్యర్ధులగుండెల్లో దడ పుట్టించేందు కు తమ తమ శక్తి కొలది ప్రయత్నిస్తారు. అందుకోసం ప్రజలను సభలకు రప్పించటానికి ప్రత్యేక ఆకర్షణ కావాలి. దానికోసం సినీ గ్లామర్ ను ఉపయోగించుకోవటం దక్షిణాదిన సాంప్రదాయమై పోయింది. అందుకే సినీస్టార్లను తమ తరఫున ప్రచారానికి రప్పిస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్ లో గతంలో చాలా మంది సినీతారలు ఎన్నికల ప్రచారంలో విరివిగా పాల్గొనే వారు. నందమూరి తారక రామారావు రాజకీయరంగ ప్రవేశం ఆపై తెలుగుదేశం పార్టీని స్థాపనతో ఆయన కోసం ఆయన వెంట తెలుగురాష్ట్ర రాజకీయాల్లోకి సినీ గ్లామర్ ప్రవహించింది. ఎన్నికల వేళ సినీతారలు విచ్చేసి తమకు అనుకూలమైన పార్టీల తరఫున, అభ్యర్థుల తరఫున ప్రచారం చేసి వారి విజయానికి కృషి చేసేవారు.
2019సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి సినీతారలు దూరంగా ఉండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నా యి. నటన వృత్తిగా స్వీకరించిన వారికి ప్రతి ప్రేక్షకుడు కావలసిన వారే. ఎవరి తరఫున ప్రచారం చేసినా ఆ పార్టీ మనిషిగా సినీ తారలకు ముద్రపడుతూ ఉండటంతో ఎన్నికల తర్వాత వారికి ఒక పార్టీ ముద్ర ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతు న్నాయని సినీతారలకు ఇప్పటికే అనుభవమైంది. అందుకే వారంతా ప్రచారానికి దూరంగా ఉండటానికే వారు మొగ్గు చూపు తున్నట్లు సమాచారం.
దీనికి ఉదాహరణగా ఇటీవల తెలంగాణ ఎన్నికల తరుణంలో స్వయంగా తమ సోదరి నందమూరి సుహాసిని ఎన్నికలబరిలో దిగినా యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాం ఇరువురూ ప్రచారం చేయలేదు. దానికి ప్రధాన కారణం ఒక పార్టీకి చెందిన ముద్ర వేయించు కోవటం ఇష్టంలెకే. టీఆర్ఎస్ అధినేతలతో వారికి, వారి తండ్రి నాటి నుండి ఉన్న సన్నిహిత సత్సంబంధాలే అందుకు కారణమన్నది జగమెరిగిన సత్యం. నందమూరి బాలకృష్ణ ప్రచారం చేసినా, ఆయన రాజకీయాల్లోని మనిషే కాదు తెలుగుదేశం ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు. అయినా ఆయనకు "ఎన్టీఆర్ కథానాయకుడు" సినిమా విడుదలలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయనే సమాచారం ఉంది.
రానున్న 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేనపార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బరిలో నిలుస్తున్నారు. అయినప్పటికీ జనసేన పార్టీ తరఫున ప్రచారానికి ఏ సినీతార కూడా వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదట. పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారానికి ఎన్నికల రంగంలోకి దిగితే టీడీపీ - వైసీపీ పార్టీల్లోని తమ అభిమానులు అంగీకరించరని దాని ప్రభావం ఆ తరవాత రానున్న తమ సినిమాలపై విశేషంగా పడుతుందని వారు భయపడుతున్నారని తెలుస్తుంది.
ఇప్పటికే రాజకీయాల్లో స్థిరపడ్డ సినీతారలు మాత్రమే వచ్చే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారని తెలుస్తుంది. దీంతో ఎన్నికల ప్రచారానికి అదనపు ఆకర్షణ అయిన సినీ గ్లామర్ లేకుండా పోతుందని జనం నిట్టూరుస్తున్నారు. సినీ తారల ఆకర్షణ లేక ప్రచార సభలు వెలవెల పోనున్న దశలో అభ్యర్ధులలో నిరాశ పెరిగిపోతుంది. ముఖ్యంగా సినీ రంగం నుండి ఊపిరి పొసుకొన్న టిడిపికి ఈ విషయం ఆశనిపాతమే.