ఒక మహా నాయకుడు.. ఒక మహా నటుడు.. ఈ రెండు కలిసిన వ్యక్తికి సంబంధించిన అన్ని విషయాలు, ఆసక్తికరమైనవే అయినా అన్నీ ఒకటి, రెండు సినిమాల్లో చెప్పడం సాధ్యం కాకపోవచ్చు. ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ వన్ విడుదలై.. మరో పార్ట్ సిద్దమవుతున్న సమయంలో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు, ఆయన ప్రాంతానికి చెందినవారు తమ అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
అలా టీవీ9లో ఔట్ పుట్ ఎడిటర్గా పనిచేస్తున్న మల్లంపల్లి సాంబశివరావు కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు షేర్ చేసుకున్నారు. ఈయన స్వగ్రామం వేంపాడుకీ , ఆ పొరుగునే ఉన్న ఇందుపల్లికీ ఎన్టీఆర్ వల్ల ఒక బాండ్ వచ్చిందట. ఎన్టీఆర్ వల్ల వేంపాడులో టైలర్లూ, ఇందుపల్లిలో వంటవాళ్లూ ఒక బ్రాండ్గా మారిపోయారు. ఎన్టీఆర్కి పెద్ద పెద్ద బాబీకాలర్లూ, చీపుర్ల కంటే గొప్పగా స్వచ్ఛ భారత్కి ఉపయోగపడే ఇంతింత పొడవైన బెల్బాటమ్లూ కుట్టిన యాక్స్ టైలర్ వాలేశ్వరరావు సాంబశివరావు ఊరి వాడే.
సినిమాల్లో కంటే ముందుగానే.. ఆ ఊరిలో ఆ ఫ్యాషన్లు కనిపించేవట. ఎన్టీఆర్ వల్ల ఆ టైలర్ బంధువుల పిల్లలంతా టైలరింగ్లోనే సెటిలయ్యారట. అనేక పట్టణాలలో అదే బ్రాండ్తో ఇప్పటికీ కుడుతున్నారట. ఇందుపల్లిలో కోటేశు అనే వ్యక్తి బాగా వంటలు చేస్తాడని బంధువుల ద్వారా విన్న ఎన్టీఆర్, తన కుటుంబంలోని అన్ని ఫంక్షన్లకీ అతడితో వండించేవారట.
దాదాపు 27 సినిమాల షూటింగ్లకు కూడా కోటేశునీ, అతడి మనుషులతోనే వంటలు చేయించాడట. దీంతో కోటేశు పేరు చెన్నయ్, హైదరాబాద్, బెంగుళూర్లకూ పాకిందట. కోటేశు పుణ్యమా అని ఇందుపల్లితో పాటు, పరిసరగ్రామాలైన వేమండ, వెంట్రప్రగడ, మదిరపాడుల్లో అనేకమంది బడుగుజీవులు కూలీనాలీ చేయాల్సిన అవసరం లేకుండా , స్వతంత్రంగా, గౌరవంగా బతికే ఉపాధిని సంపాదించుకున్నారట. తాను బతుకుతూ.. తన ప్రాంతం వారి జీవితాలను నిలబెట్టిన మహామనిషి ఎన్టీఆర్.. దటీజ్ ఎన్టీఆర్ !