ఎన్టీఆర్ బయెపిక్ విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న నేపథ్యంలో ఆయన గురించి అనేక విషయాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి. ఈ తరం వారికి ఎన్టీఆర్ గురించి తెలిసింది తక్కువే. అందుకే ఎన్టీఆర్ గురించిన విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఎన్టీఆర్.. బెజవాడ గవర్నమెంటు కాలేజీలో చదివారు. ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడట. చదువుకునే రోజుల్లోనే ఎన్టీఆర్కు కళలపట్ల మక్కువ ఎక్కువ. ఆయన ఓసారి కళాశాల ఉత్సవాల్లో ఓ నాటకంలో నటించారట. అయితే అది మహిళ పాత్ర కావడం విశేషం.
పోషించింది మహిళ పాత్ర అయినా మీసాలు తీసేందుకు మాత్రం ఎన్టీఆర్ అస్సలు ఒప్పుకోలేదట. మరి ఎలా మేనేజ్ చేశాడో గానీ.. మొత్తానికి ఆ నాటకంలో మీసాలతోనే ఎన్టీఆర్ నటించాడట. అప్పటి నుంచి అందరూ కాలేజీలో ఆయన్ను మీసాల నాగమ్మ అంటూ ఆటపట్టించేవారట.
అంతే కాదు.. ఎన్టీఆర్ మొదటి నుంచి కష్టజీవి. ఆయన విజయవాడలోని పటమటలో ఉండే రోజుల్లో పాలు కూడా అమ్మాడని చెబుతారు. పాలు అమ్మే స్థాయి నుంచి రాష్ట్రాన్ని పాలించే స్థాయికి చేరుకున్నారు. ఎన్టీఆర్ బయోపిక్లో ఈ విశేషాలు కూడా ఉంటే మరింత సమగ్రంగా ఉండేదని ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఒక్క సినిమాలో అన్నీ చూపించలేరుగా.. పాపం క్రిష్ కష్టాన్నికూడా అభిమానులు అర్థం చేసుకోవాలి.