ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందంకు గుండె ఆపరేషన్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన అభిమానులు, బంధు మిత్రులు ఆందోళనకు గురయ్యారు. గత కొంత కాలంగా ఆయన ఛాతి నొప్పితో బాధపడుతుండగా హైదరాబాద్లోని ప్రముఖ డాక్టర్ని సంప్రదించారు. వారి సలహా మేరకు శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.
దేశంలోనే అత్యుత్తమమైన ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్'లో ఈ నెల 14న గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, ప్రముఖ హృదయ శస్త్రచికిత్స నిపుణులు రమాకాంత్ పాండా తన తండ్రికి సర్జరీ చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చటం జరిగిందని బ్రహ్మానందం తనయుడు హీరో గౌతమ్ తెలిపారు.
శస్త్ర చికిత్స జరిగిందని తెలిసి అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ పరిశ్రమ లోని ప్రముఖులు అందరూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేస్తున్నారని, అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సుల వల్ల తన తండ్రి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉందని గౌతమ్ అన్నారు. కాగా, బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్దార్థ్లు, ఆయన కుటుంబసభ్యులు తండ్రితో పాటు ముంబైలో ఉన్నారు