ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇటీవల గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఉండే బ్రహ్మానందం ముంబైకు చెందిన ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం ఆశ్చర్యం కలిగించింది. హార్ట్ సర్జరీలో నిపుణులు ఎందరో హైదరాబాద్ లో ఉన్నారు కూడా.
మరి హైదరాబాద్ నుంచి ముంబైకు బ్రహ్మానందం ఎందుకు వెళ్లారు.. ఇక్కడి వైద్యుల సూచన మేరకే ఆయన ముంబై వెళ్లారా.. హైదరాబాద్ వైద్యులు సరి చేయలేనంత క్లిష్టమైన సమస్య వచ్చిందా.. అసలు బ్రహ్మానందంకు ఏమైంది.. అంత క్రిటికల్గా ఉందా.. అన్న ప్రశ్నలు తలెత్తాయి.
జరిగిందేమిటంటే.. బ్రహ్మానందం ముందుగా హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స చేసి ఓ వారం రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారు. ఐతే బ్రహ్మానందం సినీ ప్రముఖుడు కావడంతో ఆయనకు పరామర్శలు ఎక్కువగా ఉంటాయని కుటుంబ సభ్యులు భావించారు.
విశ్రాంతి తీసుకోవాల్సిన ఆయన ఈ పరామర్శల కారణంగా ఇబ్బంది పడతారని భావించిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ వైద్యుల సూచనల మేరకు ముంబై ఆసుపత్రికి తరలించారు. బ్రహ్మానందంకు హార్ట్ సర్జరీ విజయవంతంగా పూర్తయిందని.. ఆయన్ను ప్రస్తుతం జనరల్ వార్డుకు తరలించారని ఆయన కుమారులు తెలిపారు. బ్రహ్మానందం త్వరగా కోలుకుని మళ్లీ వెండితెరపై నవ్వులు పూయించాలని ఆశిద్దాం.