ఆగిందనుకున్న ముప్పు మళ్ళీ మొదటికి వచ్చింది. కొత్త ఏడాది మొదటి రోజునే దెబ్బేస్తే బాగోదనుకుని వాయిదా వేసుకున్న నిర్ణయం ఇపుడు అమలుకు సమయం దగ్గర పడింది. తెలుగు చానళ్ళకు పెను గండమే ముందుంది. దానికి విరుగుడు అంటూ చేస్తున్న పోరాటానికి ముహూర్తం ఖారారైంది.


రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెలుగు ఛానల్స్‌ ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు లోకల్ కేబుల్ ఆపరేటర్లు (ఎల్‌సీఓ), మల్టీపుల్ సిస్టమ్ ఆపరేటర్ల సంఘం (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కొత్త టారిఫ్ విధానం వల్ల కేబుల్ ఆపరేటర్లతో పాటు సామాన్య ప్రజలపై పెను భారం పడుతుందని సంఘం ప్రతినిధులు తెలిపారు. ట్రాయ్ నిబంధన కారణంగా భవిష్యత్ కార్యాచరణపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కేబుల్ ఆపరేటర్లు హైదరాబాద్‌లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.


కొత్త విధానం ప్రకారం ప్రేక్షకులు తమకు కావాల్సిన ఛానెల్‌ను ఎంచుకుని దానిని కొనుక్కోవాలన్నారు. ఇతర ఛానెల్స్‌తో పోలిస్తే తెలుగు ఛానెల్స్ ఎక్కువ ధర చెబుతున్నాయని వారు తెలిపారు. కేబుల్ ఆపరేటర్లు అతి తక్కువ ధరకే 200 నుంచి 300 ఛానెల్స్ అందిస్తున్నారని ట్రాయ్ కొత్త నిబంధనల కారణంగా ప్రేక్షకులపై అదనపు భారం పడుతుందని తెలంగాణ ఎమ్మెస్వో అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి తెలిపారు. ఎమ్మెస్వోలు అన్ని తెలుగు ఛానళ్లను కేవలం రూ.40కే అందిస్తున్నారని అయితే ట్రాయ్ నిబంధనల కారణంగా పే ఛానల్స్ అధిక రేట్లు వసూలు చేస్తున్నాయని తెలిపారు. 

 ఛానల్స్ అన్ని ఫ్రీ టూ ఎయిర్ అయ్యే వరకు సమయం లేదన్నారు. పే ఛానల్స్‌ను చూడటం తగ్గిస్తే వాళ్లే దారికొస్తారని ప్రజలకు సూచించారు. టారిఫ్ విధానంపై ప్రేక్షకులకు, ఆపరేటర్లకు అవగాహన లేదని, కేంద్రం కనీసం ఆరు నెలల గడువు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 1 నుంచి పే ఛానల్స్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తానికి ఏది ఎలా ఉన్నా ఈ వివాదం పుణ్యమాని చానళ్ళను కొన్నాళ్ళు చూసే అవకాశం లేకుండా పోతుందేమో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: