రమ్యకృష్ణ.. అన్నిభాషల్లో కలిపి కనీసం 400 సినిమాల్లో నటించిన నాయకి. రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా.. అంటూ ఆమె నర్తిస్తే తెలుగు తెర ఊగిపోయింది. అలాంటి నటి తన జీవితంలోని విషాదకరమైన ఘట్టాలను ఇటీవల మీడియాతో పంచుకుంది. కెరీర్ ప్రారంభంలోనే ఆమె ప్రమాదానికి గురైన నరకయాతన అనుభవించిందట.
1984లో ముతల్ వసంతం అనే సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురైందట. సినిమా కోసం వేసిన మెట్లను నిజమైనవే అనుకుని అడుగేయడంతో 15 అడుగుల లోతులో పడిపోయిందట. కుడి కాలి మడమకు బాగా గాయమైందట.
అప్పుడు ఆ సినిమా హీరో అరుణ్ పాండ్యన్ తనను చేతులపై ఎత్తుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారట. ఆ గాయం వల్ల ఏడాదిలో మూడు సార్లు ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చిందట. ఆ సినిమా షూటింగ్ సమయంలో చాలా బాధపడ్డానని.. షూటింగ్ పూర్తయ్యాక ఇంటికొచ్చి ఏడ్చేదాన్నని పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు రమ్యకృష్ణ.
ఆ ఏడాది తాను నటించిన మూడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో తాను స్టార్ అయ్యానని.. అంతటి బాధ తర్వాత తనకు ఆనందం దక్కిందని చెబుతోంది రమ్యకృష్ణ. ఈ గాయం వల్ల కొన్ని సినిమాలు కోల్పోయానని.. మరికొందరు ఇచ్చిన అడ్వాన్సు వెనక్కు తీసుకున్నారని తెలిపింది. 1984 తన జీవితంలో మరపురాని ఏడాదిగా వర్ణించారు రమ్యకృష్ణ.