హాస్యనటుడు బ్రహ్మానందం ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. బ్రహ్మీ కుటుంబం మాత్రం బ్రహ్మానందం కోలుకుంటున్నారని ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు సినీపెద్ద పరుచూరి గోపాలకృష్ణ ఆయన ఆరోగ్యం గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు.
బ్రహ్మానందం గ్యాస్ ప్రాబ్లమ్ గురించి స్టార్ ఆసుపత్రికి వెళ్లారని.. అక్కడి వైద్యులు పరీక్షించి ఇది గ్యాస్ ప్రాబ్లమ్ కాదు.. ఓ ఆపరేషన్ అవసరమవుతుందని చెప్పారని పరుచూరి తెలిపారు. కాకపోతే ఆ ఆపరేషన్ తర్వాత నాలుగైదు వారాలు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారట.
హైదరాబాద్ లో అయితే పరామర్శలు ఉంటాయి కాబట్టి ముంబైలో అయితే ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవచ్చన్న ఉద్దేశ్యంతో ఆయన ముంబైను ఎంచుకున్నారట. ఆపరేషన్ చాలా బాగా జరిగిందని.. ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారని పరుచూరి తెలిపారు.
తాను ఇప్పుడే బ్రహ్మానందం కుటుంబంతో మాట్లాడనని చెప్పిన పరుచూరి.. త్వరలోనే ఆయన హైదరాబాద్ వస్తారని తెలిపారు. బ్రహ్మానందం ఆరోగ్యంగా తిరిగివచ్చి గతంలో ఆయన నెలకొల్పిన రికార్డులను తానే బద్దలు కొట్టాలని పరుచూరి గోపాల కృష్ణ ఆకాంక్షించారు.