టాలీవుడ్ లో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన 'వినయ విధేయ రామ' సినిమా ఆశించిన విధంగా సక్సెస్ అందుకోలేకపోయింది. రామ్ చరణ్, బోయపాటి కాంబో ఇన్ని నష్టాలను తీసుకొస్తుందని ఊహించలేదు. ఈ సినిమా షూటింగ్ మొదలు ప్రీ రిలీజ్ ఫంక్షన్ వరకు ఎన్నో అంచనాలు పెంచుతూ వచ్చారు. ముఖ్యంగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అంటే హీరోయిజాన్ని ఎంతో గొప్పగా ఎలివేట్ చేస్తారన్న విషయం తెలిసిందే..ఇక రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాంచరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ విపరీతమైన అంచనాలు పెంచుకున్నారు.
అయితే టైటిల్ కి సినిమాకు పొంతన లేకుండా వినయ విధేయ రామ కాకుండా ప్రళయ రుద్ర రాముడి లా రాంచరణ్ కనిపించడం..భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ కాలేక పోయారు. దాంతో సినిమా అంచనాలు తప్పడం కలెక్షన్లు తగ్గడం జరిగింది. కలెక్షన్ల పరంగా ఈ సినిమా మంచి నెంబర్లే చూపించడంతో బయ్యర్లు కాస్త కోలుకున్నారు.
ఈ సినిమాకోసం రూ.72 కోట్లు చెల్లించి నైజాం, ఏపీ హక్కులను దక్కించుకుంది యూవీ క్రియేషన్స్. యాభై కోట్ల వరకు రికవరీ రావడంతో మరో ఐదు కోట్ల వరకు నిర్మాత దానయ్య రిటర్న్ ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే పండుగ సెలవుల కారణంగా 60 కోట్ల షేర్ మార్క్ ను అందుకోగలిగింది.ఇక ఓవర్సీస్ లో ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు..దాంతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ నష్టపోయాడట.
ఈ విషయం తెలుసుకున్న నిర్మాత దానయ్య తన ఉదార స్వభావాన్ని చూపించారు. ఆ నష్టాన్ని కొంతవరకైనా తగ్గించాలనే ఉద్దేశంతో, నిర్మాత డీవీవీ దానయ్య 50 లక్షల వరకూ వెనక్కి ఇచ్చేశాడని తెలుస్తోంది. అంతే కాదు మరికొంత మంది డిస్ట్రిబ్యూటర్లకు కూడా నష్టపరిహారం చెల్లించాలనే ఉద్దేశంతో వాళ్లతో చర్చలు జరుపుతున్నట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.